సినీ నటి కేసులో సాక్ష్యాధారాలను భద్రపరచండి : హైకోర్టు - AP HC on kadambari Jethwani Case
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 12:33 PM IST
AP HC on kadambari Jethwani Case : కుక్కల విద్యాసాగర్ వేసిన వ్యాజ్యంపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేప్టటింది. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీ జత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన వ్యాజ్యంలో తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసు వ్యవహారమై మీడియాలో డిబేట్లు జరపకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.
Mumbai Actress Harassment Case : ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని వ్యాజ్యంలో కుక్కల విద్యాసాగర్ తెలిపారు. ఈ కేసుకు సమాంతరంగా ఇదే వ్యవహారంపై మరో అధికారితో దర్యాప్తు చేయకుండా అడ్డుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు సాగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినించారు. ఆధారాలను భద్రపరిచేలా ఆదేశించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు.
పోలీసుల తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వ్యాజ్యంలో వినతి అస్పష్టంగా ఉందని హైకోర్టుకు వివరించారు. ఈ వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. అధికారులందరూ ప్రస్తుతం వరద సహాయ చర్యల్లో ఉన్నారని ఆయన న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ముంబయి నటిపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకు భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులకు స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేశారు.