By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 12:11 PM IST
పెట్రోల్ బదులు నీళ్లు!- వైఎస్సార్సీపీ నేత బంక్ ఎదుట వాహనదారుల ఆందోళన - Adulterated Petrol in Gudivada
Adulterated Petrol in Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలోని బంటుమిల్లి రోడ్డులోని వైఎస్సార్సీపీ నేతకు చెందిన ఓ పెట్రోల్బంక్ వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ కల్తీ కావడంపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాహనాల్లో పెట్రోల్ పోయిస్తే నీళ్లు రావడం ఏంటని ప్రశ్నించారు. వారం క్రితం ఇదే విధంగా జరిగితే అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని వాహనాదారులు అసహనం వ్యక్తం చేశారు. కల్తీ పెట్రోల్ వలన తమ వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు కల్తీ పెట్రోల్ విక్రయిస్తూ ఆక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ బంకులో పోయించుకున్న పెట్రోల్ వల్ల తమ వాహనాలు మధ్యలో ఆగిపోతున్నాయని వాపోయారు శనివారం రాత్రి సుమారు 15 మందికిపైగా వినియోగదారులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. రాత్రిపూట వాహనాలు ఆగిపోతుంటే ఏంచేయాలని బాధితులు నిలదీశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెట్రోల్బంక్పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు.
దీనిపై పెట్రోల్బంక్ సిబ్బంది మరోలా సమాధానం ఇస్తున్నారు. సాంకేతిక కారణాలతో పెట్రోల్ ఉత్పత్తిలోని కెమికల్స్ సరిగ్గా కలవలేదని నిర్వాహకులు తెలిపారు. ఇథనాల్ కలవకపోవడం వల్లే వాహనాలు ఆగిపోయాయని అంటున్నారు. అయినా తమ తప్పేమీ లేదని, సాంకేతిక కారణాల వల్లే ఇలా జరుగుతోందని బంకు యాజమాన్యం చెబుతోంది.