ఆర్టిస్టులు తమ అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తారు : హస్యనటుడు బ్రహ్మానందం - Actor Brahmanandam at tirupati
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 24, 2024, 10:25 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-03-2024/640-480-21064061-thumbnail-16x9-brahmanandam-at-sv-shilapa-kalasala.jpg)
Actor Brahmanandam At Sv Shilpa Kalasala in Tirupati : వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు కళాకారులు తమ నైపుణ్యాన్ని జొడిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని హస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. ఈరోజు తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో నిర్వహించిన 'శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన' పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 202 మంది కళాకారులు గీసిన శ్రీవేంకటేశ్వరుని చిత్రాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామివారి చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించే భాగ్యం శ్రీనివాసుని దయవల్లే కలిగిందన్నారు. మిత్రుడు సలహాతో తాను చిత్రీకరించిన చిత్రాన్ని పుస్తకంలో ముద్రించడం గర్వకారణంగా ఉందని తెలిపారు.
లలిత కళల్లో నైపుణ్యం సాధించడం అందరికి సాధ్యపడదని అమ్మవారి ఆశీస్సులు ఉన్నవారే రాణించగలరన్నారు. కళ ఒక్కటే కానీ కళాకారులు ఎంతో మంది ఉంటారు. సూర్యుడు, మిణుగురు పురుగు రెండు ఒక్కటి కాదు. కానీ రెండు కూడా కాంతిని వెదజల్లుతాయని తెలిపారు. కాబట్టి ఎవరి నైపుణ్యం వారికుంటుందని వెల్లడించారు. కళాకారులు తమ బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారన్నారు. గడ్డిపువ్వులో అందాన్ని చూస్తేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్థమవుతుందని బ్రహ్మానందం వెల్లడించారు.