టీడీపీ ప్రభుత్వంలో శిలాఫలకం వేస్తే - వైసీపీ ప్రభుత్వంలో కబ్జా చేశారు - YCP leaders grabbed government land - YCP LEADERS GRABBED GOVERNMENT LAND
YCP leaders grabbed government land: ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. రాత్రికి రాత్రే, ప్రభుత్వ భూమిని ట్రాక్టర్తో చదును చేయించారు. గత ప్రభుత్వంలో కార్యాలయ నిర్మాణం కోసం వేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. భూమి కబ్జాపై అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు.


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 1:03 PM IST
YCP leaders grabbed government land: ప్రభుత్వాధికారులు ఎన్నికల హడావిడిలో ఉండగా, అధికాపార్టీ నేతలు భూ కబ్జాలపై కన్నేసిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో కనిగిరి మున్సిపల్ కార్యాలయం కోసం కేటాయించిన భూమిని, వైసీపీ నేతలు రాత్రికి రాత్రే చదును చేశారు. శిలాఫలకాన్ని సైతం నామరూపాలు లేకుండా చేశారు. ప్రభుత్వ భూమిని వంతుల వారిగా ఆక్రమించే పనిలో పడ్డారు. భూమికి రక్షకులుగా ఉండాల్సిన ప్రభుత్వాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా కనిగిరిలో నూతన మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు కోసం కొత్తూరు సమీపంలో ఒక ఎకరా స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం, ఆ స్థలం విలువ సుమారు రూ. 10 కోట్లకు పైగా పలుకుతుంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డితో పాటుగా, అప్పటి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కార్యాలయ నిర్మాణం కోసం శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. అయితే పనులు ప్రారంభం అవుతాయనే లోగా టీడీపీ ప్రభుత్వం మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పురోగతిలేదు. కార్యాలయ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ స్థలంలో పిచ్చి మొక్కలు వెలిశాయి.
మున్సిపల్ కార్యాలయం కోసం సేకరించిన స్థలంపై అధికార వైసీపీ నేతల కన్నుపడింది. ఇదే అదునుగా రాత్రికి రాత్రే, భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ శిలాఫలకం ఆనవాళ్లు లేకుండా పూర్తిగా చదును చేశారు. అనంతరం ఎకరా ప్రభుత్వ స్థలాన్ని చదును చేశారు. ఆ ప్రదేశంలో ఉన్న పిచ్చిమెుక్కలను ట్రాక్టర్తో చదును చేసి పంచుకోవడానికి సిద్ధమయ్యారు.
కనిగిరిలో వాలంటీర్లకు తాయిలాలు - జగన్ చిత్రంతో ఉన్న సంచిలో గిఫ్టులు
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, స్థానిక అధికారులు ఎన్నికల నిర్వాహణలో లీనమయ్యారు. ఇదే అదునుగా భావించిన అధికార పార్టీ నేతలు భూమిని కబ్జా చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. సుమారు రూ. 10 కోట్ల విలువ చేసే స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి స్థానికులు వెనకడుగు వేస్తున్నారు. కబ్జా చేసిన భూమిని వాటాలుగా చేసి పంచుకుంటారనే వార్తలు వెలువడుతున్నాయి.
భూ కబ్జా అంశంపై కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్రనరసింహా రెడ్డి స్పంధించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్యాలయం కోసం సేకరించిన భూమిని అధికార పార్టీ నేతలు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, భూ కబ్జాలకు పాల్పడిన వారిపై తీవ్రమై చర్యలు తప్పవని హెచ్చరించారు.
'కోడ్' కూసినా మేల్కొని అధికారులు- కనిగిరి ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ స్టిక్కర్లు