TS RTC Response On Go Rural Ad Agency Man Arrested For Cheating : ఆర్టీసీ బస్సుల్లో ప్రకటనల ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూ. 21.73 కోట్లు మోసం చేసిన కేసులో గో రూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ అరెస్ట్ కావడం పట్ల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం హర్షం వ్యక్తంచేసింది. ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015 సెప్టెంబర్లో టీఎస్ఆర్టీసీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందం మేరకు ఆరు సంవత్సరాలకు (2015 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు) గో రూరల్ ఇండియా సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదు. హైదరాబాద్ రీజియన్లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్లో రూ.10.98 కోట్లు బకాయిలున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ బకాయిలపై సమీక్ష జరిపి దృష్టి సారించారు. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
Ad Agency Man Arrested For Cheating RTC : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీకి పలుమార్లు లీగల్ నోటీసులను సంస్థ జారీ చేసింది. ఈ క్రమంలో ఆ నోటీసులకు స్పందించిన యాడ్ ఏజెన్సీ, రూ.55 లక్షలకు చెల్లని చెక్కులు ఇచ్చింది. దీంతో గో రూరల్ ఇండియా సంస్థ మోసం చేసిందంటూ అఫ్జల్ గంజ్, మారేడ్పల్లి పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్కు బదిలీ అయింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు గో రూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ను ఈనెల 3వ తేదీన అరెస్ట్ చేశారు.
ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఫీజులను ఎగవేసే సంస్థలపై నిబంధనల మేరకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని, బకాయిలు చెల్లించకుండా మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని ఆర్టీసీ సంస్థ స్పష్టం చేసింది.
సిబ్బందిపై దాడి ఘటనలపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ - బాధ్యులపై చర్యలు తప్పవని వార్నింగ్
తప్పతాగి ఆర్టీసీ బస్సులో మహిళ హల్చల్ - చిల్లర కోసం కండక్టర్పై దాడి