Thief Escaped Second Time From Police Station : అతగాడు ఓ దొంగ, అలా అని గజదొంగ కాదు. ఇళ్లలో కుళాయి పైపులను చోరీ చేస్తుంటాడు. తరచూ దొంగతనాలు చేస్తుండటంతో పక్కా ప్లాన్ వేసి అతన్ని స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి ఆ దొంగ పరారయ్యాడు. వెంటనే అతడి కోసం గాలించి ఆచూకీ కనిపెట్టి జైల్లో వేశారు పోలీసులు. మళ్లీ ఠాణా నుంచి ఖాకీలకు మస్కా కొట్టి పారిపోయాడు. ఇలా రెండు సార్లు పోలీస్స్టేషన్ నుంచి పరార్ అయిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్గూడ పరిధిలో చోటు చేసుకుంది. పరారైన దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.
పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ యూసుఫ్గూడ సమీపంలోని యాదగిరినగర్లో ఇటీవల కాలంలో ఇళ్లలోని కుళాయిలు చోరికి గురవుతున్నాయి. అనుమానం వచ్చి స్థానికులు దగ్గర్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ దొంగ నల్లాలను కాజేస్తున్నట్లుగా కనిపించింది. ఈ వీడియోలు కాస్త బస్తీ కమిటీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు.
చివరికి ఈ నెల 1వ తేదీన నిఘా పెట్టి దొంగను స్థానికులు పట్టుకున్నారు. యాదగిరి నగర్ జనరల్ సెక్రటరీ కె.మహేందర్ దొంగను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. పట్టుబడ్డ దొంగ నేపాల్కు చెందిన వికాస్గా గుర్తించారు. ఠాణా నుంచి అదే రోజు దొంగ పరారయ్యాడు. మళ్లీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో శుక్రవారం రోజున రెండో సారి దొంగను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లో ఉంచారు. మధురానగర్ పోలీసులకు మస్కా కొట్టి పోలీసు స్టేషన్ నుంచి ఆదివారం సాయంత్రం మళ్లీ పారిపోయాడు ఆ దొంగ.
ఈ క్రమంలో విధి నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగ పరారవ్వడంతో వెంటనే పెట్రోలింగ్, బ్లా కోల్డ్స్ పోలీసుల్ని అప్రమత్తం చేసి వెదికినా నిందితుడి జాడ లభ్యం కాలేదు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతూ, పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
'మహిళా దొంగలు మాయ చేశారు'- 'ఏటీఎం ధ్వంసం చేసి 29లక్షలు చోరీ' - Theft Cases in AP