Telugu First News Reader Shanti Swaroop Passed Away : 'నమస్కారం వార్తల్లోని ముఖ్యంశాలు అంటూ' చదివిన తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కంఠం మూగబోయింది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నేడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్లో తొలిసారి తెలుగు వార్తను చదివి, శాంతి స్వరూప్ రికార్డు సృష్టించారు. పదేళ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు.
Shanti Swaroop Died in Hyderabad : బుల్లి తెరలో ప్రసారమైన తెలుగు వార్తల్లో మొట్టమొదటి న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ (News Reader Shanti Swaroop) పేరు చరిత్రలో నిలిచిపోయింది. నేటికీ వార్తలంటే 80, 90 దశకాల ప్రేక్షకులకు ఆయన పేరే గుర్తుకు రావడం సహజం. ప్రశాంతవదనం, స్పష్టమైన పద ఉచ్ఛారణ, గంభీరమైన కంఠంతో ఏమాత్రం తొణికిసలాడకుండా వార్తలు చదవడంలో శాంతి స్వరూప్ది ప్రత్యేక శైలి. నేడు వార్తలు చదువుతున్న ఎందరో న్యూస్ రీడర్లకు వారు ఆదర్శం. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు.
Leaders Condolence on Gaddar Death : 'గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు'
Doordarshan Shanti Swaroop Death : 1983 నవంబర్ 14న సాయంత్రం 7:00 గంటలకు తొలిసారిగా తెలుగులో వార్తలను ప్రసారం చేశారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో ఓ వైపు బాలల చలన చిత్రోత్సవాలు, మరోవైపు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ రెండింటిని ప్రధాన అంశంగా ఆరోజు వార్తల్లో శాంతి స్వరూప్ ప్రస్తావించారు. వార్తలు ప్రారంభించే ముందు మొదటి అంశంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేకంగా పంపించిన సందేశాన్ని ప్రేక్షకులకు చదివి వినిపించారు.
2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ దూరదర్శన్లో పని చేశారు. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తప్పులు లేకుండా స్క్రిప్ట్ను చూడకుండా చదవాలని వార్తలను కంఠస్తం చేసినట్లు, పలు ఇంటర్వ్యూల్లో శాంతి స్వరూప్ స్వయంగా పేర్కొనడం విశేషం. తన గాత్రం, వార్తల ప్రజెంటేషన్తో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటు.