Smart City Constructions Has Stopped in No Funds: కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో ఐదేళ్లుగా స్మార్ట్ సిటీ నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 2016లో తిరుపతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 30 నాటికి గడువు ముగుస్తున్నా స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 25 ప్రాజెక్ట్లు పూర్తికాలేదు. సామాజిక మౌలిక వసతుల కల్పన, క్రీడా మైదానాలు, భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నగర పాలక సంస్థ తమ వాటా నిధుల విడుదలలో జాప్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కేంద్రం చేపట్టిన స్మార్ట్ సిటీ నిర్మాణాలు తిరుపతిలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. 2016లో కేంద్రం దేశ వ్యాప్తంగా చేపట్టిన స్మార్ట్ సిటీ నిర్మాణాలలో తిరుపతికి చోటు కల్పించారు. 1593 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 500 కోట్ల రూపాయల చొప్పున, స్థానిక సంస్థల వాటాగా 593 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన స్మార్ట్ సిటీ నిధులకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 186 కోట్లు కేటాయించింది. 2019 మేలో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో స్మార్ట్ సిటీ నిధులు అటకెక్కాయి. టీడీపీ సర్కారు విడుదల చేసిన 186 కోట్లు మినహా గడచిన ఐదేళ్లలో వైసీపీ సర్కారు చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఫలితంగా పలు ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
'స్మార్ట్గా అమరావతి' పీకనొక్కిన జగన్ సర్కార్ - Amaravati Smart City funds
నగరపాలక సంస్థ కార్యాలయ స్థానంలో 330 కోట్ల రూపాయలతో సమీకృత భవనాన్ని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టెండరు ప్రక్రియ పూర్తి చేసి రూ. 288 కోట్ల పనులను గుత్తేదారుకు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు 25 శాతం లోపు నిర్మాణాలు పూర్తైన వాటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల సమీకృత భవన నిర్మాణాలు ఆగిపోయాయి.
రెండేళ్ల తర్వాత 2021లో పనులు ప్రారంభించినా 11 కోట్ల రూపాయల మేర మాత్రమే పూర్తయ్యాయి. క్రీడా మైదానాలు, మౌలిక వసతుల కోసం మొత్తం 21.94 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఆరు ప్రాజెక్టుల్లో ఒక్కటి మాత్రమే పూర్తికాగా మిగిలినవి నిధుల కొరతతో ఆగిపోయాయి. 193 కోట్ల రూపాయలతో సామాజిక వసతుల కల్పన చేపట్టినా నిధుల లేమితో 53 కోట్ల రూపాయల పనులు మాత్రమే జరిగాయి. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా ఉండడంపై నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక ప్రజలతో పాటు తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు టీడీపీ హయాంలో చేపట్టిన గరుడవారధి పనుల్లో వైసీపీ ప్రభుత్వం మార్పులు చేసింది. తిరుచానూరు నుంచి అలిపిరి వరకు విస్తరిస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన నేతలు గత ప్రతిపాదనలను పూర్తి చేయలేదు. ఫలితంగా టీటీడీ, నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన పనులు అరకొరగా పూర్తవగా మౌలిక లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది.
ఇతర రాష్ట్రాలు దూసుకుపోతుంటే ఏపీ మాత్రం ఎందుకిలా? - స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై సర్కార్ నిర్లక్ష్యం