Komuravelli Mallanna Jathara in Telangana 2024 : సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో మల్లన్న దేవాలయాల్లో జాతరలు మొదలయ్యాయి. కొమురవెల్లి మల్లన్న జాతర, వరంగల్ జిల్లాలో ఐనవోలు(Inavolu Mallanna Jathara) శ్రీ మల్లికార్జున స్వామి జాతర, హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు, సిద్ధిపేట జిల్లా బండ మల్లన్న జాతర జరుగుతున్నాయి.
సిద్దిపేటలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర వైభవంగా జరుగుతుంది. భక్తుల కొంగుబంగారం కోర మీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు మొదటి ఘట్టం 'పట్నంవారం' శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గు డొల్ల చప్పుళ్ల మధ్య అంగరంగ వైభవంగా ముగిసింది.
ఐనవోలు మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు - భద్రత పెంచిన పోలీసులు
Komuravelli Mallanna Jathara 2024 : మల్లన్న బ్రహ్మోత్సవాల్లో (Mallanna Jathara) మొదటి ఆదివారం హైదరాబాద్ భక్తులు సొంత ఖర్చులతో 'పట్నం, అగ్నిగుండం' కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పట్నం, అగ్నిగుండాల కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు సాగింది. పట్నం, అగ్నిగుండం ఏర్పాటు పూర్తి కాగానే ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి అర్చకులు పూజలు చేశారు. ఒగ్గుపూజారులు మల్లన్నను స్తుతించారు.
అనంతరం పట్నం మీదుగా అగ్నిగుండాలను దాటడం కొనసాగింది. సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి ఆలూరి బాలాజీ, పాలక మండలి ఛైర్మన్ లక్ష్మా రెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్, కమిటీ సభ్యులు అగ్నిగుండం దాటి వచ్చిన శివసత్తులకు, పోతరాజులకు, భక్తులకు ఆచారం(కానుకలు) ఇచ్చి సత్కరించారు. మూడు వేల మందికి రవిక వస్త్రాలు, సెల్లాలు అందజేశారు.
సంక్రాంతి వేళ - అంగరంగ వైభవంగా ఐనవోలు మల్లన్న జాతర
పట్నం వేయడానికి భక్తులు రెండు క్వింటాళ్ల బండారు(పసుపు), కుంకుమ, బియ్యపు పిండి, తంగేడు ఆకులతో చేసిన ఆకుపచ్చ వర్ణ చూర్ణాలను వాడారు. 28 గడులతో పట్నం వేశారు. దాదాపు నాలుగు గంటల పాటు 20 మంది దీనిలో పాల్గొన్నారు. ఆనందంతో భక్తులు ఒకరినొకరు బండారు పూసుకున్నారు. ఆలయ పరిసరాలు పసుపు వర్ణమయ్యాయి. అగ్నిగుండాలకు 25 క్వింటాళ్ల కర్రలను ఉపయోగించారు. ఈవో బాలాజీ, పాలక మండలి ఛైర్మన్ లక్ష్మా రెడ్డి, సభ్యులు, సిబ్బంది నర్సింహులు, పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైభవంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర - మొక్కులు చెల్లించుకున్న భక్తులు
కొమురవెల్లిలో మలన్న మూలవిరాట్ దర్శనం నిలిపివేత - తిరిగి ఈనెల 7న పునః ప్రారంభం