Karthika Pournami Celebrations: కార్తిక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. ఆలయంలో సుమారు 9 వేల వ్రతాలు జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించి గిరిప్రదక్షిణ ప్రారంభించారు. వేడుకల్లో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.


KARTHIKA POURNAMI IN SIVA TEMPLES: కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో గిరిప్రదక్షిణ పూజలు ఘనంగా జరిగాయి. పరమేశ్వరుడ్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని నీలకంఠేశ్వరుని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. శ్రీశైలంలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు జరిగాయి. కృష్ణవేణి నదీమ తల్లికి పూజలు చేసి అర్చకులు హారతులు ఇచ్చారు. ఆలయం ముందు గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. కాగడాలతో తోరణ వత్తులను ఈవో దంపతులు వెలిగించారు. జ్వాలాతోరణోత్సవాన్ని వేలాది భక్తులు తిలకించారు.
కార్తిక పౌర్ణమి వేళ పంచరామాల్లో ప్రధమ క్షేత్రం అమరావతి అమరేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్త జనం శివుని దర్శనానికి పోటెత్తారు. జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడికి ప్రణమిల్లి కార్తీక దీపాలతో పూజలు చేశారు. జ్వాలతోరణాలతో పరమేశ్వరుడిని ఆరాధించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఈవో కేఎస్ రామరావు దంపతులు, వేద పండితులు ప్రారంభించిన గిరిప్రదక్షిణ వైభవంగా సాగింది. అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శివ క్షేత్రాల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. నంద్యాల నవ నందుల ఆలయాన్ని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి దర్శించుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరప్పాడులో ఏడాదిలో మూడు సార్లు మాత్రమే లభించే స్పటిక లింగ స్పర్శ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనకాపల్లి జిల్లా ఫణిగిరిపై కొలువైన శ్రీ ఉమాధర్మలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గిరిప్రదక్షిణను ప్రారంభించారు. బాపట్ల సూర్యలంక తీరంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర సాగర హారతి ఇచ్చారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేంపల్లి పట్టణంలోని గవి మల్లేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు పోటెత్తారు. ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణాన్ని వెలిగించారు. మహిళలు వెలిగించిన కార్తీక దీపాల కాంతికి గవి మల్లేశ్వర స్వామి ఆలయం దగదగా మెరిసింది.