Jagan About YSRCP MLA's And Mp's : కాకినాడ సిటీ నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మంచివాడు, సౌమ్యుడని పేదలకు మంచి చేస్తారని సీఎం జగన్ ఆకాశానికెత్తేశారు. కానీ కాకినాడలో ఐదేళ్లుగా అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేదు. రేషన్ మాఫియాకు కాకినాడే కేంద్ర స్థానంగా పేరుపడింది. ఆ మాఫియా నేత ఎవరో కాస్త అడిగి చెబుతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెద్దాపురం, జగ్గంపేట, అనపర్తి ప్రాంతాల్లో మట్టిని మింగేసిన ఘనులూ ఉన్నారు. విశాఖ మన్యం నుంచి గంజాయి తెచ్చే ముఠాకు నాయకుడెవరో కూడా ఆరా తీసి చెప్పాలంటున్నారు. గతంలో ప్రతిపక్షాలకు చెందిన అగ్రనేతలను మహిళా ప్రతినిధుల ఎదుటే అసభ్య పదజాలంతో దూషించారన్న సంగతైనా మీ అభ్యర్థికి తెలుసేమో అడిగారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాస్త ఆ విషయాలన్నీ కనుక్కుని ప్రజలకు వివరించి చెప్పొచ్చుగా అని అడుగుతున్నారు.
‘తుని నుంచి పోటీచేస్తున్న దాడిశెట్టి రాజా మంచివాడు, తనకు స్నేహితుడని జగన్ ప్రశంసల్లో ముంచెత్తారు. మూడుముక్కలాటలు, గానా బజానాల్లో మునిగితేలే నేతలెవరో ఆయనకు బాగా తెలుసని నియోజకవర్గంలోని వారంతా అంటున్నారు. అయిదేళ్లుగా నియోజకవర్గంలో అరాచకాలకు అంతే లేదు. లాటరీ టికెట్లు, గుట్కా వ్యాపారం చేయిస్తూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. మట్టి, ఇసుకను కొల్లగొడుతున్నారు. వాళ్లంతా ఎవరో మీ స్నేహితుడికి తెలుసా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దళితుల సాగుభూముల్నీ వదలకుండా కబ్జా చేసిన ఘనులెవరో కూడా మీ స్నేహితుడ్ని అడిగి చెప్పాలంటున్నారు.
మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందే ఉంటారంటూ కాకినాడ రూరల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కన్నబాబును జగన్ వెనకేసుకొచ్చారు. కన్నబాబు ఎమ్మెల్యే అయ్యాక కాకినాడ గ్రామీణ నియోజకవర్గం అంతులేని అక్రమాలెన్నింటికో కేంద్రమైంది. ఇంటిపట్టా ఇవ్వాలంటే 60వేల నుంచి లక్షా 50వేల రూపాయలు కట్టాలని పేదలను వేధించారు. రియల్ఎస్టేట్ వెంచర్లు వేసుకోవాలన్నా కాంట్రాక్టు పనులు చేయాలన్నా లక్షల్లో వసూలు చేశారు. వివాదాస్పద భూములు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని బెదిరించి వాటిని కబ్జా చేశారు. సౌమ్యుడంటూ జగన్ కితాబిచ్చిన కన్నబాబుకు ఇవన్నీ తెలుసో లేదో, ఎవరు చేశారో ఆయన్ని అడిగి చెబుతారా అని స్థానిక ప్రజలు అడుగుతున్నారు. భూ వివాదాల కారణంగా ఇటీవల ఒక వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇన్ని దారుణాలు జరుగుతుంటే మంచి చేయడానికి కన్నబాబు నాలుగు అడుగులు ముందుంటారన్న సీఎం జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి.
కాకినాడ నుంచి వైఎస్సార్సీపీ ఎంపీగా పోటీచేస్తున్న సునీల్కు, జగన్కు మధ్య అంత బంధానికి కారణాలేంటో కూడా కాస్త వివరంగా చెప్పి ఓట్లడిగితే ప్రజలంతా తెలుసుకునేవారు కదా అని విపక్ష నేతలు అడుగుతున్నారు. ఆయనకు చెందిన ఇంటిగ్రేటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు కర్నూలు జిల్లాలో 7466 ఎకరాలు కేటాయించారు. ఎన్నికల కోడ్ వచ్చే కొద్దిరోజుల ముందు 1,985 ఎకరాలు గంపగుత్తగా అమ్మేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే కదా? పరిచయం చేసేటప్పుడే ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పాల్సిందని విపక్షాలు అడుగుతున్నాయి.
ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న వరుపుల సుబ్బారావు పొట్టివాడైనా గట్టివాడు, మనసున్నవాడని సీఎం జగన్ ప్రశంసలతో ముంచేత్తారు. దళిత డ్రైవర్ను హత్యచేసి డోర్ డెలివరీ చేశారనే కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఈయనకు బంధువనే విషయం జనాలకు చెప్పాల్సింది. సుబ్బారావు గెలుపు బాధ్యతలు అనంతబాబుకే అప్పగించారంటున్నారు. అది నిజమైతే ఆ సంగతులేంటో ఓటర్లకు వివరించి చెప్పి ఉండాల్సింది. అక్రమ మైనింగ్తో కోట్ల రూపాయలు కొట్టేస్తున్నదెవరో ఈ మనసున్న మనిషికి తెలుసేమో ఆరా తీయండి అని స్థానికులు చెబుతున్నారు.
పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీలో ఉన్న దవులూరి దొరబాబు మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తున్నారని జగన్ కితాబిచ్చారు. అధికార పార్టీ అండగా అరాచకాలు చేస్తున్న నాయకులెవరో ఈ ఉత్సాహవంతుడికి ఏమైనా తెలుసేమో అడిగారా జగన్ అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పెద్దాపురంలో జరిగే సెటిల్మెంట్ల వెనక ఎవరున్నారో, రామేశ్వరం మెట్టలో 826 ఎకరాల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేసిందెవరో జగన్ కనుక్కుంటే బాగుండేది. స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండానే అధికారం చెలాయించే నాయకులూ ఈ నియోజకవర్గంలో ఉన్నారని జగన్ గొప్పలు పోయారు. వారెవరో కాస్త తెలుసుకుని ఓటర్లకు చెప్పండని విపక్షాలు మెుత్తుకుంటున్నాయి.