Irregularities in Tirupati in Master Plan roads: తిరుపతి నగరంలో నిర్మించిన బృహత్ ప్రణాళిక రహదారులు గత ప్రభుత్వ పెద్దలకు ఆదాయవనరుగా మారాయి. రహదారుల నిర్మాణాల ముసుగులో అడ్డగోలుగా భూములు లాక్కొని టీడీఆర్ బాండ్ల పేరుతో కోట్ల రూపాయలు దిగమింగడంపై చూపిన శ్రద్ధ, భవిష్యత్ తరాలకు పనికి వచ్చేలా రహదారులు నిర్మించడంపై చూపలేదు. దీంతో మాస్టర్ ప్లాన్ రహదారులు నిధుల స్వాహాకు రూపొందించిన ప్రణాళికగా మారిపోయాయి.
రహదారుల నిర్మాణాల సమయంలో మురికికాలువలు ఏర్పాటు చేయాలన్న కనీస ప్రమాణాలు పాటించకుండా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను వ్యయం చేశారు. ఫలితంగా మురికినీరు, వర్షపునీరు ప్రవహించే దారిలేక మాస్టర్ ప్లాన్ రహదారులు, మురికి గుంటలుగా మిగిలిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నేతల అవినీతి దాహానికి అద్దం పట్టేలా తిరుపతి నగర మాస్టర్ ప్లాన్ రహదారులు మారాయి.
తిరుపతి నగర బృహత్తర ప్రణాళిక (MASTER PLAN) రహదారుల నిర్మాణంలో వైఎస్సార్సీపీ నేతల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బైటపడుతున్నాయి. కమీషన్ల కక్కుర్తితోపాటు ఎన్నికల ముందు రాజకీయలబ్ధి కోసం అడ్డగోలుగా రహదారుల నిర్మాణాలు చేపట్టారు. భవిష్యత్తు అవసరాల ముసుగులో రహదారులు నిర్మించి కోట్ల రూపాయలు దిగమింగారు. మాస్టర్ ప్లాన్ రహదారులకు అనుసంధానంగా కాలువలు నిర్మించాలనే కనీస నిబంధనలను గాలికి వదిలేశారు. సాధారణంగా మాస్టర్ ప్లాన్ రహదారులు భవిష్యత్ జనాభా విస్తరణ సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్మిస్తారు.
40 సంవత్సరాల అవసరాల్ని అంచనా వేసి ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ రహదారులు మాత్రం అప్పటి స్థానిక ప్రజా ప్రతినిధి, ఆయన కుమారుడు చెప్పినట్లుగా నిర్మించారు. ఫలితంగా వర్షపు నీరు వెళ్లేందుకు వీలులేక రహదారులు మురుగుతో నిండిపోతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది.
తిరుపతి పరిధిలో బృహత్ ప్రణాళిక రహదారుల నిర్మాణాలలో భాగంగా చేపట్టిన భూసేకరణలో నిబంధనలు అతిక్రమించి టీడీఆర్ బాండ్లు కట్టబెట్టారు. అక్రమాల్లో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణా కర్రెడ్డితోపాటు ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. తమ అనుంగ గుత్తేదార్లకు పనులు కట్టబెట్టి అనుచిత లబ్ధి పొందడం తప్ప, ప్రజా అవసరాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన నాటి పాలకుల లీలలు. పదవి నుంచి దిగిపోయాక వెలుగులోకి వస్తున్న అక్రమాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపునీటి కాల్వలు, డ్రైనేజీ, కేబుళ్ల ఏర్పాటుపై కనీస అంచనా లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం నాసిరకంగా రోడ్లు నిర్మించడం స్థానికులకు శాపంగా మారింది.
షెడ్డుకు చేరిన డబుల్డెక్కర్ బస్సు- కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగం - Double Decker Bus in Dumpyard