MLC Kavitha Bail Denied in Delhi Liquor Scam : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆమె బెయిల్ కోరుతూ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను దిల్లీ ధర్మాసనం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దిల్లీ కోర్టును ఆశ్రయించారు.
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. వారం రోజుల ఈడీ కస్టడీ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించాక, ఏప్రిల్లో విచారణ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నారు. దీంతో తనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ గతంలో రెండు వేర్వేరు పిటిషన్లను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేయగా, విచారించిన ఆ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఆమె దిల్లీ ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
MLC Kavitha Bail Reject in Delhi Liquor Case : మద్యం కేసులో కవితను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారని, ఒక పార్టీకి కీలక నేతగా ఉన్నా ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారంటూ ఆరోపిస్తూ ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఈడీ, సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తూ, దిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని కోర్టుకు తెలిపారు.
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసు కీలక దశలో కొనసాగుతున్న సమయంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. సీబీఐ, ఈడీ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ, కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.