CJI DY Chandrachud Visited Tirumala Temple: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి మహాద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.
CJI DY Chandrachud Visit Tirupati SV University: తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తిరుపతి ఎస్వీ వర్సిటీని పరిశీలించారు. వర్సిటీ నిర్వహణలో టీటీడీ పాత్ర, వేదాధ్యయన విభాగాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. ఈ క్రమంలో తాళపత్ర గ్రంథాల డిజిటలైజ్ తీరును సీజేఐ అడిగి తెలుసుకున్నారు. వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. వేద వ్యాప్తికి టీటీడీ కృషి అభినందనీయమని కొనియాడిన సీజేఐ తిరుమల శ్రీవారి దర్శనానంతరం మానసిక ప్రశాంతత లభించిందని తెలిపారు.
CJI Chandrachud Tirupati Tour: జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మంగళవారం నుంచి రెండు రోజుల పాటు తిరుమల పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఉదయం తిరుపతికి చేరుకున్న ఆయన ఎస్వీ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహించిన బీఏ ఎల్ఎల్బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు 10వ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం చేశారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు, యూనివర్సిటీ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం తిరుమల చేరుకున్నారు. మంగళవారం రాత్రి తిరుమలలోని శ్రీరచనా అతిథి గృహంలో బస చేశారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.