AP Government Released Social Pension Funds for June Month : జూన్ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 65,30,808 మంది పెన్షనర్లకు రూ.1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47,74,733 మంది బ్యాంకు ఖాతాలకు పింఛను సొమ్ము జమ చేయనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి 5 వరకు ఇంటింటికీ వెళ్లి 17,56,105 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛను నగదు ఇచ్చే అవకాశం ఉన్నా పింఛన్దారులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసింది. మేలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి వారిని మరింత ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడూ అదే విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నేటికీ అందని పింఛన్ - కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వృద్ధుల అవస్థలు
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన సందర్భంలో ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది. వారితో ఫింఛన్ల పంపిణీ నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫింఛన్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ప్రస్తుతం జూన్ నెలకు సంబంధించిన పింఛన్ సొమ్మును కూడా అదే పద్దతిని పాటించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఫింఛన్లలను ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.