AP CEO Mukesh Kumar Meena Meeting With Political Parties : ఎన్నికల షెడ్యూలు వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచారంలో హెలికాప్టర్లు, వాహనాల వినియోగం, సభలు, సమావేశాలు, ఊరేగింపుల నిర్వహణకు ముందుగా తీసుకోవాల్సిన అనుమతుల వ్యవహారంపై ఆయన రాజకీయ పార్టీలకు సూచనలు జారీ చేశారు. సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రత్యేకించి ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు చేసే వ్యయంపై పర్యవేక్షణ అంశంపైనా ఆయన పార్టీల ప్రతినిధులకు సూచనలు ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియతో పాటు కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీలు, వారి తరపున ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు.
ఎన్నికల అధికారులతో సీఈవో సమీక్ష - లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల నిర్వహణపై చర్చ
ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యంపై సీఈఓకి ఫిర్యాదు : కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సి ఉందని ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై అవగాహన ఉంటే జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సందేహాలకు, గందరగోళానికి తావుండదని ఆయన పేర్కోన్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలను సీఈఓ దృష్టికి తెచ్చాయి. ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యంపైనా, కొందరు ఉద్యోగులు పరిధి దాటి వ్యవహరిస్తున్న అంశంపైనా టీడీపీ, సీపీఎం పార్టీలు ఎన్నికల సీఈఓకి ఫిర్యాదు చేశాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతంపైగా పోలింగ్ నమోదే లక్ష్యం: సీఈఓ
Praja Shanti Party President KA Paul Protest : ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై సచివాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసనకు దిగారు. తొలుత సచివాలయం ప్రధాన గేట్ వద్ద ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. అయితే సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని, ఇప్పుడు కలవలేరని సిబ్బంది కేఏ పాల్కు తెలిపారు. దీంతో ఆయన ఐదో బ్లాక్ మెట్ల వద్దే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వీల్లేదని భద్రతా సిబ్బంది ఆయనను బయటకు తరలించారు.
ఎన్నికల నిర్వహణపై ఈసీ ముఖేశ్ సమీక్ష- అధికారులతో వీడియో కాన్ఫరెన్స్