Rohit Sharma Five Key Decisions In Cricket : టీమ్ఇండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. జట్టును మరింత దూకుడుగా ముందుకు నడిపిస్తున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో తనదైన నిర్ణయాలతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. జట్టు కూర్పు, టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ ఔరా అనిపిస్తున్నాడు. రోహిత్ కెప్టెన్సీలోనే భారత జట్టు ఇటీవల టీ20 ప్రపంచ కప్ను అందుకుంది కూడా. ఈ నేపథ్యంలో రోహిత్ తన కెప్టెన్సీలో తీసుకున్న ఐదు కీలక నిర్ణయాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ఇషాన్ కిషన్ను కాదని గిల్కి మద్దతు
టీమ్ఇండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్పై వేటు తర్వాత తొలుత ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత ఇషాన్ స్థానంలో గిల్కు జట్టులో చోటు కల్పించాడు రోహిత్. దీంతో 2023 ప్రారంభంలో న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ సహా మూడు శతకాలు బాదాడు. అలాగే గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లోనూ రాణించాడు.
పుజారా, రహానేను కాదని సర్ఫరాజ్కు ప్లేస్
గతంలో టీమ్ఇండియా మిడిలార్డర్కు మూలస్తంభాలుగా ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఉండేవారు. అయితే వరుస టోర్నీలో విఫలమవ్వడం వల్ల వారిపై వేటుపడింది. ఆ తర్వాత మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వంటి యంగ్ ప్లేయర్లకు రోహిత్ అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ ఇటీవలే న్యూజిలాండ్తో బెంగళూరులో జరిగిన టెస్టులో శతకం బాదాడు.
కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ
అలాగే టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను మళ్లీ జట్టులోకి తీసుకురావడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. వేటు ఎదుర్కొన్న రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కుల్దీప్ వరుసగా టీ20, వన్డే సిరీస్ల్లో రాణిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ చేరడంలో కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు కూడా.
2024 టీ20 ప్రపంచ కప్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విషయాన్నైనా వ్యూహాత్మకంగా ఆలోచిస్తాడు. ఇవే ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాయి. ఉదాహరణకు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు అక్షర్ పటేల్ను బ్యాటింగ్కు దింపాడు. ఇది సక్సెస్ అయ్యి అక్షర్ మంచి నాక్ ఆడాడు. అలాగే దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ రోహిత్ వ్యూహాత్మకంగా ఆలోచించాడు. ప్రోటీస్ జట్టు విజయం కోసం 28 బంతుల్లో కేవలం 27 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యకు బంతిని ఇచ్చాడు రోహిత్. అప్పుడు విధ్వంసరకర బ్యాటర్ క్లాసెన్ను పాండ్య పెవిలియన్కు పంపాడు.
వన్డే, టీ20 ఫార్మాట్లో టీమ్ఇండియాను రోహిత్ నడిపిన తీరు అద్భుతం. 2023 వన్డే ప్రపంచకప్లో భారత జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడంలో రోహిత్ దూకుడు బాగా పనికొచ్చింది.
'మేం కష్టాల్లో ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురయ్యా - కోహ్లీ, హార్దిక్ కాపాడారు' - రోహిత్
ధోనీ సలహా పట్టించుకోని రోహిత్! హిట్మ్యాన్ తొలి డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ఏం జరిగిందంటే?