INDIA VS ZIMBABWE 2nd T20 : హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. 235 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 134 పరుగులకే ఆలౌటైంది. మద్వీర (43) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11), ముకేశ్ కుమార్ (3/37) జింబాబ్వేను కట్టడి చేశారు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు.
మ్యాచ్ సాగిందిలా :
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (100) తన ఇన్నింగ్స్లో శతకం బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దీంతో అంతర్జాతీయ టీ20లో తన సెంచరీ ఖాతా తెరిచాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ (77*) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆఖరిలో బరిలోకి దిగిన రింకు సింగ్ (48*) కూడా ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం (2) తొలి మ్యాచ్లాగే ఇప్పుడు కూడా నిరాశ పరిచాడు.
ఆ ఓవరే హైలైట్
ఈ మ్యాచ్లో తొలుత నెమ్మదిగా ఆడిన అభిషేక్ శర్మ ఆ తర్వాత వేగం పుంజుకున్నాడు. ఒక దశలో 30 బంతుల్లో 41 పరుగులతో మాత్రం ఉన్న అతడు ఆ తర్వాత బాల్ను బౌండరీ దాటిస్తూ దూసుకెళ్లాడు. డియోన్ మేయర్స్ బౌలింగ్లో వరుసగా 4, 6, 4, 6, 4 బాదేశాడు. రజా వేసిన 13 ఓవర్లోనూ వరుసగా రెండు సిక్స్లు సాధించాడు. మసకద్జ వేసిన తర్వాతి ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లు బాది సెంచరీతో చెలరేగిపోయాడు. అయితే ఆ తర్వాతి బంతికే మేయర్స్కు చేతికి చిక్కి పెవిలియన్ బాట పట్టాడు.
ఇదిలా ఉండగా, 38 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు స్టార్ ప్లేయర్ రుతురాజ్. తొలుత నెమ్మదిగానే ఆడిన రుతు కూడా ఆ తర్వాత దూకుడు పెంచాడు. చటార బౌలింగ్లో వరుసగా 4, 6, 4, 4 పరుగులు స్కోర్ చేశాడు. యంగ్ ప్లేయర్ రింకు సింగ్ కూడా తనదైన శైలిలో సిక్సర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు.