YS Sharmila Election Campaign : హంతకులను కాపాడేందుకు సీఎం జగన్ తన పదవిని వాడుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వివేకా హత్య కేసు నిందితుడికే మళ్లీ వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాష్, జగన్ ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు : కడప పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయడానికి కారణం వివేకాను హత్య చేయించిన వారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వడమని వైఎస్ షర్మిల తెలిపారు. హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వాడుతున్నారని ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని పేర్కొన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని గర్తు చేశారు. ఒక వైపు రాజశేఖర్రెడ్డి బిడ్డ మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్ ఉన్నారని అన్నారు. ధర్మం కోసం ఒకవైపు తాను, డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని, ఎవర్ని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలని షర్మిల అన్నారు.
ప్రత్యేకహోదా బీజీపీకి తాకట్టు పెట్టారు : వైఎస్ రాజశేఖర్రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారన్నారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. ప్రత్యేకహోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకు తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. ప్రత్యేకహోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవని, రాజధాని లేదు, పోలవరం పూర్తికాలేదు, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్పై ఒక్క అడుగూ ముందుకు పడలేదని, వైఎస్సార్ ఉండి ఉంటే అది పూర్తయ్యేదని చెప్పారు. ప్రజల భవిష్యత్ బావుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.
కాంగ్రెస్లో చేరిన కిల్లి కృపారాణి : ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్రావు కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అధికార పార్టీలో అవమానాలు ఎదుర్కోలేకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఇటీవల కృపారాణి వెల్లడించిన సంగతి తెలిసిందే.
జోరుగా కాంగ్రెస్ నేతల ప్రచారం - జగన్ను సాగనంపడమే లక్ష్యంగా ముందడుగు - Congress leaders campaign