Dharmapuri Srinivas Political Journey : ధర్మపురి శ్రీనివాస్ ఇది పరిచయం అవసరం లేని పేరు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్. దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి వుండి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రుల నియామకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ డీఎస్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చేదంటే ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగారో అర్ధం చేసుకోవచ్చు.
రాజకీయ చతురత కలిగిన నేత : సుమారు దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా వున్న కాంగ్రెస్ పార్టీని తన సారథ్యంలో తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనతను దక్కించుకున్నారు. వరుసగా 2004 , 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ చతురతతో పరిస్థితులను తలకిందులు చేయగల నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేశారు.
ఇదీ ధర్మపురి శ్రీనివాస్ నేపథ్యం : 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్లో జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1974 నుంచి 1984 వరకు పదేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేశారు. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్లు డీఎస్ కుమారులు. అర్గల్ రాజారాం న్యాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన డీఎస్ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ లో పనిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ నుంచి తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.
Posts held By DS : 1998లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1989 నుంచి 1994 మధ్య గ్రామీణాభివద్ధి శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన డీఎస్ సుమారు దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేశారు. 2004లో టీఆర్ఎస్( ప్రస్తుత బీఆర్ఎస్) కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించిన డిఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్తో కలిసి కీలక పాత్ర పోషించారు.
అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడిగా : 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా పనిచేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహరాల సలహాదారుగా పనిచేశారు. తనతో ఉన్న సాన్నిహిత్యంతో కేసీఆర్ డీఎస్కు 2016లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్ల పాటే మిగిలింది.
2022 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా : టీఆర్ఎస్ పార్టీకి డీఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సొంత జిల్లాకు చెందిన నేతలు ఆయనపై నిందలు మోపారు. దీనిని సవాల్ చేస్తూ తన తప్పిదాలను నిరూపించాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలుమార్లు డిమాండ్ చేసిన డీఎస్ 2022లో బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరినట్లు జరిగిన ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసిన డీఎస్ తనని వివాదాల్లోకి లాగవద్దని కోరారు. వయసు రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
సోనియాకు వీర విధేయుడిగా : సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు పొందిన ధర్మపురి శ్రీనివాస్ ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డితో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి.
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత - ధర్మపురి అర్వింద్ భావోద్వేగ పోస్ట్ - D Srinivas passed away
హైదరాబాద్లోని నివాసానికి డీఎస్ భౌతికకాయం తరలింపు - ఆదివారం నిజామాబాద్లో అంత్యక్రియలు