Prime Minister Narendra Modi Confidence on NDA victory in Andhra pradesh : రాష్ట్రంలో సాగిన తన రెండు రోజుల పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగిందని సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారు. రోడ్ షో ముగిశాక గ్రీన్ రూమ్లో చంద్రబాబు, పవన్కల్యాణ్తో మోదీ 10నిమిషాలకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, మంచి విజయాన్ని కూటమి సాధించబోతోందని చంద్రబాబు, పవన్తో మోదీ అన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కూటమి జోష్ : ఏపీలో ఎండ వేడిమి తీవ్రంగా ఉందని, ఆ ప్రభావం పోలింగ్పై పడకుండా చూడాలని చంద్రబాబు, పవన్కు మోదీ సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 7 నుంచి 10 గంటలలోపే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ శాతం ఎంత పెరిగితే ఎన్డీఏకు అంత లాభమని వారికి మోదీ చెప్పారు. తనను ఆదరించిన ఏపీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర అగ్రహం, అసంతృప్తితో ఉన్నారన్న నివేదికలు ఉన్నాయని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి జోష్ పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.
మోదీ ట్వీట్ : చంద్రబాబు, పవన్ కల్యాణ్తో కలిసి విజయవాడలో నిర్వహించిన రోడ్ షో మధురానుభూతిని కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల ఏపీలో జరిపిన పర్యటన ద్వారా ప్రజా మద్దతు పెద్ద ఎత్తున కూటమికే ఉందన్నది స్పష్టమైందన్నారు. మహిళలు, యువ ఓటర్లు కూటమిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు.