Lok Sabha Voting in Disputed Areas in Telangana : భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఒకే ఓటు హక్కు ఉండాలి. కాని ఆ గ్రామాల్లో ఒక్కో ఓటరుకు రెండేసి ఓట్లు ఉన్నాయి. వారికి ఓటు హక్కే కాదు ఇద్దరు సీఎంలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు తదితర అంశాలు రెండేసి ఉన్నాయి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా, అలా ఉంటే ఎన్నికల సంఘం ఏమి చేస్తుందని ఆలోచిస్తున్నారా? ఆ ప్రాంత ప్రజల పరిస్థితి తెలుసుకుందాం.
Telangana Maharashtra Border Villages Polling : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో నిర్వహించే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి రెండేసి చొప్పున రేషన్ కార్డులు, పింఛన్లు, ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయి. గ్రామాల్లోనూ రెండు రాష్ట్రాలకు చెందిన విద్యుత్తు స్తంభాలు, రెండు పాఠశాలలు, రెండు అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండటం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేయడంతో వారికి ఇద్దరు సీఎంలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు సర్పంచులు ఉన్నారు. ఆ గ్రామాలు ప్రస్తుతం కుమురంభీం జిల్లాలోని కెరమెరి మండలంలోని పరందోళి, కోటా, శంకర్ లొద్ది, లెండిజాల, ముకుదంగూడ, మహరాజ్ గూడ, అంతపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఎస్సాపూర్, బోలాపటార్, గౌరి. ఈ గ్రామాలు 1956లో రాష్ట్రాల పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి.
లోక్సభ తొలిదశ ఎన్నికలు- 3గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే? - Lok Sabha Elections 2024
Telangana Maharashtra Border Dispute : 12 గ్రామాల్లోని 9,246 మంది జనాభాలో 3,283 మంది ఓటర్లు ఉన్నారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా మహారాష్ట్రకు దగ్గరగా ఉండటంతో 1987లో ఈ గ్రామాలను చంద్రపూర్ జిల్లా జీవితి తాలుకాలో చేరుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఈ ప్రాంతంలోని అటవీ భాగమంతా కుమురంభీం జిల్లా కాగజ్నగర్ డివిజన్ పరిధిలో ఉంది. దీంతో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా కేకే నాయుడు కమిషన్ను ఏర్పాటు చేశాయి. ఈ కమిటీతో పాటు హైకోర్టు కూడా ఆ గ్రామాలు ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని తీర్పునిచ్చింది. దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది.
Maharashtra Polling 2024 : మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యాయి. 12 గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ వివాదం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. రెండు ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పథకం వారికి చేరలేదని ఆవేదన చెందుతున్నారు. ఇరువైపుల రాజకీయ నాయకులు హామీలు కురిపించి వాటిని నెరవేర్చలేదని వాపోతున్నారు.