KTR Tweet On TSCAB Chairman Resignation : రాష్ట్ర సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్ రావు, గొంగిడి మహేందర్ రెడ్డిలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ బాటలో, తమ పదవులకు రాజీనామా చేసిన వారి నిర్ణయం అభినందనీయమని అన్నారు.
-
తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ గారి బాటలో... ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన శ్రీ కొండూరి రవీందర్ రావు గారు, గోంగిడి మహేందర్ రెడ్డి గారి నిర్ణయం అభినందనీయం
— KTR (@KTRBRS) May 31, 2024
కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని… pic.twitter.com/vMskv39WTW
కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా నమ్మి నడిచిన గులాబీ పార్టీని, కేసీఆర్ బాటకే జైకొట్టారని గుర్తు చేశారు. తమ పదవీకాలంలో రాష్ట్రంలో సహకార బ్యాంకులను అద్భుతంగా నడిపిన వీరి పేరు రాష్ట్ర సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పదివేల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న టెస్కాబ్ను రూ.42,000 కోట్ల సంస్థగా తీర్చిదిద్ది, వినియోగదారుల సంఖ్యతో పాటు, డిపాజిట్లను మూడు రెట్లు పెంచి నమ్మకమైన సంస్థలుగా తయారు చేశారని కొనియాడారు.
రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం : టెస్కాబ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి అనేక అవార్డులతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్ర సహకార బ్యాంక్గా నిలిపారని, వారి రాజీనామా, నాయకత్వ లేమి రాష్ట్ర సహకార రంగానికి తీరని లోటు అవుతుందని అన్నారు. అత్యుత్తమంగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను కుట్రపూరితంగా పక్కకు తప్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
TSCAB Chairman Ravinder Rao Resigned : రాష్ట్రంలో ఇటీవల ఊహించని పరిణామాల నేపథ్యంలో తాను కీలక నిర్ణయం తీసుకున్నానని తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని టెస్కాబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ అవసరాల కోసం కొందరు పార్టీ మారారని, తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు. అయినా తనకు ఎవరిపై కూడా ఎలాంటి కోపం లేదని తెలిపారు. అందుకోసం గౌరవంగా టెస్కాబ్ ఛైర్మన్ పదవికి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
తనతోపాటు టెస్కాబ్ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నారని చెప్పారు. మీడియా సమక్షంలో ఇరువురు తమ రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. అధికారికంగా టెస్కాబ్లో ఆ రాజీనామా పత్రాలు సమర్పించారు. రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా సహకార రంగం బలోపేతం కోసం నిశ్వార్ధవంగా పనిచేసే సమర్థవంతమైన నేతను టెస్కాబ్ ఛైర్మన్గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు. ఇక నుంచి కరీంనగర్ డీసీసీబీ ఛైర్మన్గా కొనసాగుతూ సహకార రంగం బలోపేతం, రైతాంగం సేవలో నిమగ్నమవుతానని స్పష్టం చేశారు.