Elon Musk India Visit : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా పడింది. వాస్తవంగా ఆదివారం ఆయన మనదేశానికి రావాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావాల్సి ఉంది. అయితే టెస్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా తన పర్యటన ఆలస్యమవుతోందని ఎక్స్ వేదికగా మస్క్ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో భారత్లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అయితే ఆయన ఈ నెల 21, 22 తేదీల్లో భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ రెండు రోజుల ప్రణాళికలో ప్రధాని మోదీ-మస్క్ కీలక భేటీ కూడా ఒకటి. అనంతరం వారు పెట్టుబడుల గురించి ప్రకటన చేస్తారని అంతా భావించారు.
'తయారీలో భారత ప్రజల స్వేదం ఉండాలి'
ఈ ఏడాదిలో భారత పర్యటన, ప్రధాని మోదీ భేటీని ధ్రువీకరిస్తూ కొద్దిరోజుల క్రితం ఎలాన్ మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇటీవల దీని గురించి ప్రధాని మోదీని అడగ్గా, భారత్కు పెట్టుబడులు రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదని, కానీ తయారీరంగంలో భారత ప్రజల స్వేదం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 'మన మాతృభూమి ప్రత్యేకత ఉండాలి. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి" అని మోదీ పేర్కొన్నారు.
'మస్క్ మోదీ ఫ్యాన్ కాదు- భారత్ అభిమాని!'
అంతేకాకుండా ఇంటర్వ్యూ సందర్భంగా తన అభిమానిని అంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. "మోదీ మద్దతుదారును అంటూ మస్క్ చెప్పారు. వాస్తవానికి ఆయన భారత్కు మద్దతుదారు. 2015లో నేను టెస్లా ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు ఆయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని మరీ నాతో భేటీ అయ్యారు. తన ఫ్యాక్టరీ మొత్తం చూపించారు. ఆయన దృక్పథం ఏంటో నాకు అర్థమైంది" అని వెల్లడించారు.
భారత విపణిలోకి టెస్లా ప్రవేశంపై గతకొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో విద్యుత్తు కార్ల వినియోగం అవసరమని గతంలో మస్క్ అభిప్రాయపడ్డారు. తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం టెస్లా వివిధ రాష్ట్రప్రభుత్వాలను సంప్రదించినట్లు సమాచారం. మహారాష్ట్ర, గుజరాత్ ఆకర్షణీయ ప్రతిపాదనలను వారి ముందుంచినట్లు, తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2-3 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఈ కుబేరుడు పలువిషయాల్లో మనకు అనుకూలంగా స్పందిస్తున్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.