Senthil Balaji Resignation TN : తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ రాజీనామాను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫారసు ఆధారంగా గవర్నర్ రాజీనామాను ఆమోదించినట్లు రాజ్భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా సోమవారం తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు సెంథిల్ బాలాజీ.
రాజీనామా ముందువరకు పోర్టుఫోలియో లేని మంత్రిగా 230 రోజులకు పైగా బాలాజీ పనిచేశారు. అంతకుముందు విద్యుత్, ప్రొహిబిషన్ శాఖలను నిర్వహించారు. గతేడాది మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఈ మాజీ మంత్రి ప్రస్తుతం పుఝల్ జైలులో ఉన్నారు. కాగా తన బెయిల్ పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో ఫిబ్రవరి 14న విచారణ జరగనున్న నేపథ్యంలో బాలాజీ రాజీనామా చేయడం గమనార్హం.
ఇదీ కేసు
2011- 2015 ఏఐడీఎమ్కే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా సెంథిల్ బాలాజీ పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బాలాజీ డీఎమ్కేలో చేరారు. అయితే గతంలో రవాణాశాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారనే (ఉద్యోగాల కుంభకోణం)ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత ఏడాది జూన్ 14న అరెస్టు చేశారు.
అరెస్టయిన తర్వాత సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ జరిగింది. అనంతరం ఆయన్ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో ఆయన జుడీషియల్ కస్టడీని కోర్టు పలుమార్లు పొడగించింది. అయితే అరెస్ట్ అయిన తర్వాత బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ఎంకే స్టాలిన్ ప్రభుత్వం కూడా ఆయన్ను పదవి నుంచి తీసేయలేదు. ఎలాంటి పోర్ట్ఫోలియో లేకుండా బాలాజీ మంత్రిగా కొనసాగారు.
సెంథిల్ బాలాజీని మంత్రిగా తొలగించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. కస్టడీలో ఉన్న బాలాజీని తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు తమిళనాడు ముఖ్యమంత్రికే వదిలేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం కూడా మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవించింది. తాజాగా బాలాజీ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్కు సిఫారసు చేశారు.