Maoists Killed In Encounter In Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని నారాయణపుర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బస్తర్ రేంజ్లో ఉన్న నాలుగు జిల్లాల(నారాయణపూర్, దంతెవాడ, జగదల్పుర్, కొండగావ్) బలగాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు ఎదురుపడ్డారు. అనంతరం పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. కూంబింగ్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.
సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఇప్పటివరకు యూనిఫాంలు ధరించిన ఏడుగురు గుర్తుతెలియని నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
ఈ ఎన్కౌంటర్పై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో ఏడుగురుని మావోయిస్టులను మట్టుబెట్టడంలో భద్రతా దళాలు విజయం సాధించాయన్నారు. "ముందస్తు సమచారంతో ఈ రోజు ఈ చర్యలు తీసుకున్నాము. గత ఐదేళ్లలో 219 మంది నక్సలైట్లు చనిపోయారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 220మంది నక్సలైట్లు మృతిచెందారు." అని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు.
అమిత్ షా పర్యటనకు ముందు భారీ ఎన్కౌంటర్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ 15న బస్తర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు దళం యాక్టివ్ అయ్యిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై పోలీసులు, బస్తర్ రేంజ్లోని నాలుగు జిల్లాల నుంచి దాదాపు వేయి మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల ఆచూకీ కోసం భారీ ఆపరేషన్ చేపట్టారు.
ఇటీవల జరిగిన ప్రధాన నక్సలైట్ ఎన్కౌంటర్లు
2024 అక్టోబర్ 4 : ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 38మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకేసారి ఇంత ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.
2024 జూలై 17 : మాహాష్ట్రలోని గడ్చిరోలిలో దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఎన్కౌంటర్లో 12మంది మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు అనేక అటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
2024 మే 10 : ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా పిడియా సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 12మంది నక్సలైట్లు మరణించారు.
2024 ఏప్రిల్ 16 : ఛత్తీస్గఢ్ బస్తర్ రేంజ్ కంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 29మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.