తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Hundi Money Counting: యాదాద్రీశుని 21 రోజుల ఆదాయం ఎంతంటే?

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 21 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ సిబ్బంది లెక్కించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 89 లక్షల 95 వేల 568 రూపాయలుగా అధికారులు లెక్కించారు. 188 గ్రా. మిశ్రమ బంగారం, 3కిలోల మిశ్రమ వెండి కానుకలుగా భక్తులు సమర్పించారు.

By

Published : Nov 10, 2021, 8:36 AM IST

Yadadri Hundi Money Counting
యాదాద్రీశుని 21 రోజుల ఆదాయం ఎంతంటే?

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం... 21 రోజుల హుండీ ఆదాయం 89 లక్షల 95 వేల 568 రూపాయలుగా అధికారులు లెక్కించారు. కొండపైన గల హరిత హోటల్​లో లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. 188 గ్రాముల మిశ్రమ బంగారం... 3కిలోల మిశ్రమ వెండి.. భక్తులు కానుకలుగా సమర్పించారు. ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్‌ నరసింహమూర్తి పర్యవేక్షణలో... లెక్కింపు జరిగింది. ఆలయ అధికారులు, సిబ్బంది.. లెక్కింపులో పాల్గొన్నారు.

హుండీ ఆదాయం లెక్కింపు

మరోవైపు యాదాద్రి శ్రీలక్ష్మీసమేత నారసింహస్వామి నిజరూప దర్శనానికి ముహూర్తం దగ్గర్లో ఉన్నందున... పునర్నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి (reconstruction work of the fast progressing). తుది దశ పనులను వచ్చే ఫిబ్రవరిలోపు పూర్తి చేసేందుకు యాడా దృష్టిసారించింది. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి... ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్తర, తూర్పు దిశల్లో 40 కోట్ల వ్యయంతో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కైంకర్యాల కోసం విష్ణుపుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లోగా పుష్కరిణి పనులు సంపూర్తి కానున్నాయి. ఆంజనేయస్వామి మందిరానికి దారి నిర్మితమవుతోంది. గండిచెరువు ప్రాంతంలో దీక్షాపరుల మండలం పూర్తయింది. కల్యాణ కట్ట పనులు 5 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. లక్ష్మీ పుష్కరిణికి సంబంధించి తుది దశ నిర్మాణం జరుగుతోంది. కొండపైన బస్ బే పనులు చకచకా సాగుతుండగా... కొండ కింద పనులు మొదలు కావాల్సి ఉంది.

హుండీ ఆదాయం లెక్కింపు

తుదిదశ పనులు పూర్తి చేసేలా...

కాలినడకన వచ్చే భక్తుల కోసం మెట్ల దారి, ప్రసాదాల తయారీ సరకుల రవాణాకు అండర్ పాస్​ను నిర్మిస్తున్నారు. కొండ కింద వైకుంఠద్వారం నుంచి మెట్ల మార్గం రూపుదిద్దుకుంటోంది. శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహణకు గాను స్థల పరిశీలన కోసం చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా... తుది దశలో మిగిలిన ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని యాడా నిర్వాహకులు భావిస్తున్నారు.

హుండీ ఆదాయం లెక్కింపు

ఇంకా 140 రోజులే...

మహాకుంభ సంప్రోక్షణకు మరో 140 రోజుల గడువు మిగిలి ఉంది. మార్చి 28, 2022 నాడు మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు... గత నెల 19 నాటి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతకు 8 రోజుల ముందే... మార్చి 21న అంకురార్పణ చేపట్టనున్నారు. 8 రోజులపాటు సాగే మహాసుదర్శన హోమంతో... మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఆ లోపునే పనులు పూర్తి కావాలన్న లక్ష్యంతో భూపాల్ రెడ్డితో పాటు యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు... నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details