తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2021, 12:00 PM IST

ETV Bharat / state

RAINS EFFECT: చౌటుప్పల్ జలమయం.. కాలనీల్లో చేరిన వరద నీరు

భారీ వర్షాలకు చౌటుప్పల్ పురపాలిక కేంద్రం జలమయమైంది(rains in telangana). కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. భారీ వర్షాల వస్తే ఏటా ఈ తిప్పలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను మరో చోట నిర్మించాలని కోరుతున్నారు.

RAINS EFFECT, rains in telangana
చౌటుప్పల్ జలమయం, తెలంగాణలో భారీ వర్షాలు

చౌటుప్పల్ జలమయం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి(rains in telangana) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కేంద్రం జలమయమైంది. పలు కాలనీల్లోని అంతర్గత రోడ్లపై నుంచి వరద నీరు పారుతోంది. స్థానిక చెరువు పూర్తిగా నిండి అలుగు పోయడంతో ఆ ప్రవాహానికి జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు నిండిపోయింది. సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సంస్థల్లోకి, లోతట్టు కాలనీల్లోకి నీరు చేరింది.

జలదిగ్బంధం

గాంధీ పార్క్‌లో 5 అడుగుల లోతు మేర నీరుతో నిండి పోయింది. మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయం, పాల శీతలీకరణ కేంద్రం, తితిదే కల్యాణ మండపంలోకి వర్షం నీరు చేరింది. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతోందని... ప్రభుత్వ కార్యాలయాలను మరో చోట నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారీ హడావిడి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు తర్వాత ఈ సమస్య గురించే పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బేకరీ దుకాణం మాది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఒక్కసారిగా నీళ్లు వచ్చాయి. పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటర్ వచ్చి షాపు మొత్తం మునిగిపోయింది. పోయిన ఏడాది, ఇప్పుడు సేమ్ పరిస్థితి. దీనిని పట్టించుకునే నాథుడే లేరు. ఒకవైపు కరోనా... మరోవైపు వరదల వల్ల నష్టం మీద నష్టం వస్తోంది. అధికారులు మరమ్మతులు చేపట్టి... మాకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-స్థానికుడు

వర్ష బీభత్సం

మరోవైపు కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు అల్లాడుతున్నారు. అరగంట నుంచి గంట వ్యవధిలోనే శనివారం మధ్యాహ్నం ఏకధాటిగా పలు ప్రాంతాల్లో వాన పడింది. అటు రంగారెడ్డి జిల్లాలో శనివారం కురిసిన వానలకు అబ్దుల్లాపూర్‌మెట్​​లోని చింతలచెరువు నిండి పొంగిపొర్లుతోంది. విజయవాడ జాతీయ రహదారి మీదుగా ఇనాంగూడ వద్ద బాట చెరువు అలుగు పారుతోంది. ఫలితంగా విజయవాడ హైవే మీదకు నీరొచ్చి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి వల్ల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానిక పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల జోక్యంతో విజయవాడ-హైదరాబాద్ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చెరువు కింద ఉన్న వరి పంట నీటమునిగింది. కొద్దిరోజుల క్రితమే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి నాట్లు వేశామని.. ఇప్పుడు వరి పంటంతా నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. బాటసింగారం నుంచి మజీద్​పూర్​కు వెళ్లే దారిలోని వాగు, లష్కర్​గూడ వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఈ వాగుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు.

ఇదీ చదవండి:Corona Update: దేశంలో మరో 42 వేల కేసులు- ఆ రాష్ట్రంలో లాక్​డౌన్​

ABOUT THE AUTHOR

...view details