తెలంగాణ

telangana

ప్రాంతీయ విమానాశ్రయాల సంగతేంటి.. అధ్యయన నివేదిక ఇవ్వడంలో జాప్యం!

By

Published : Feb 21, 2022, 11:00 AM IST

TS GOVT about Regional airports : ప్రాంతీయ విమానాశ్రయాల అధ్యయన నివేదిక ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. కాగా ద్వితీయ శ్రేణి నగరాల్లో విమాన రాకపోకల ఎప్పుడనే అంశంపై ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఎయిర్‌పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది.

TS GOVT about Regional airports
ప్రాంతీయ విమానాశ్రయాలు

TS GOVT about Regional airports : తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాల రాకపోకలు ఎప్పుడన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. తుది నివేదిక ఇచ్చే విషయంలో ఎయిర్‌పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) జాప్యం చేస్తున్న నేపథ్యంలో మరోసారి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు నగరాల్లో ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. సాధ్యాసాధ్యాల అధ్యయన బాధ్యతలను ఏఏఐకి అప్పగించింది. ఆదిలాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లు విమానాల రాకపోకలకు అనువైనవేనని ఏఏఐ 2019లో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. తుది నివేదిక ఇవ్వాలని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఏఏఐ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ ఇప్పటికే పలు దఫాలు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాదిలో హైదరాబాద్‌ వచ్చిన ఏఏఐ అధికారులు..గతంలో ఉపయోగించిన రన్‌వేలు ఉన్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లలో విమానాల రాకపోకలకు త్వరగా ఏర్పాట్లు చేయవచ్చని స్పష్టంచేశారు.

అయినా అందని తుది నివేదిక

అధికారుల అభిప్రాయాలకు అనుగుణంగా ఆ మూడు ప్రాంతాల్లో రన్‌వేల మరమ్మతులు, ఇతర ఏర్పాట్లకు అయ్యే ఖర్చుపై అంచనా వ్యయాలతో కూడిన తుది నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏటీఆర్‌-72, క్యూ-400 వంటివి కాకపోయినా తొలిదశలో అంతకన్నా చిన్న విమానాలు నడిపేందుకు చేపట్టాల్సిన పనులు, అందుకయ్యే వ్యయాలపై నివేదికలివ్వాలని సూచించింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సింథియా హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలోనూ ప్రాంతీయ విమానాశ్రయాలకు త్వరితగతిన అనుమతులివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కోరారు. అయినప్పటికీ ఏఏఐ నుంచి ఎలాంటి స్పందన లేదు.

కనీసం రెండింటికైనా

ఇటీవల కాలంలో వరంగల్‌, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. టెక్స్‌టైల్‌ పార్క్‌, ఇతర పరిశ్రమలూ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిదశలో వరంగల్‌, కొత్తగూడెం విమానాశ్రయాలలైనా సిద్ధం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర సర్కారు, అందుకు అనుగుణంగా తక్షణం నివేదికలు ఇవ్వాలని కోరుతూ మరో దఫా ఏఏఐకి లేఖ రాయాలని అధికారులకు స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన బడ్జెట్‌ వ్యయాల నివేదికను కూడా ఇవ్వాలని కోరాలని నిర్దేశించింది.

ఇదీ చదవండి:జైలుశిక్షల్లేవ్‌.. తొలిసారి చిక్కిన డ్రంకెన్‌ డ్రైవర్లకు ఉపశమనం

ABOUT THE AUTHOR

...view details