తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుకు దన్నుగా సెస్-జయశంకర్ యూనివర్సిటీ పరిశోధనలు

వ్యవసాయ అంశాలపై కేంద్రీయ ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ- సెస్‌, జయశంకర్ వర్సీటీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని పీజేటీఎస్‌ఏయూలో జరిగిన సమావేశంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పరిశోధనల కోసం ఈ ఒప్పందం దోహదపడుతుందని విశ్వవిద్యాలయం తెలిపింది.

By

Published : Dec 5, 2019, 5:01 PM IST

పీజేటీఎస్‌ఏయూతో సెస్‌ కీలక ఒప్పందం
పీజేటీఎస్‌ఏయూతో సెస్‌ కీలక ఒప్పందం

వ్యవసాయ సంబంధిత అంశాలపై కలిసి పనిచేయాలని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ - సెస్‌ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని వర్సిటీ పరిపాలన భవనంలో కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. వెల్చాల ప్రవీణ్‌రావు, సెస్‌ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ సమక్షంలో... వర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎస్.సుధీర్‌కుమార్, సెస్ సంచాలకులు డా. రేవతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

'పీజేటీఎస్‌ఏయూలో వ్యవసాయ విద్య... పరిశోధనల్లో మేటి'
ప్రొ. జయశంకర్ పేరిట ఏర్పాటైన ఈ వర్సిటీ ఐదేళ్ల కాలంలోనే వ్యవసాయ విద్య, పరిశోధనల్లో అభివృద్ధి సాధించిందని వీసీ తెలిపారు. రైతులకు విస్తృత సేవలు అందిస్తున్న తరుణంలో... అనేక నూతన స్వల్పకాలిక వంగడాలను అందుబాటులోకి తెచ్చామని వర్సీటీ వీసీ ప్రవీణ్‌రావు అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వ్యవసాయ విస్తరణ... కమ్యూనిటీ సైన్స్ విభాగం ద్వారా మహిళలు, పిల్లలకు గృహ సంబంధిత పోషకాహార అంశాల్లో సేవలందిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పరిశోధనలు చేస్తున్న సెస్‌తో ఒప్పందం వల్ల రైతులకు, వ్యవసాయ రంగానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'స్ఫూర్తి ఫౌండేషన్​తో వర్సిటీ మరో కీలక ఒప్పందం'
వర్సీటీ, సెస్‌ సంస్థలు కలిసి సదస్సులు, పరిశోధనలు కొనసాగిస్తాయని వీసీ స్పష్టం చేశారు. నీటి నిర్వహణ , ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ తదితర అంశాల్లో తమ సంస్థ అనేక ప్రాజెక్టులు తయారు చేసిందన్నారు. పీజేటీఎస్‌ఏయూతో ఒప్పందం వల్ల మరింత మేలు జరుగుతుందని సెస్ డైరెక్టర్ రేవతి అన్నారు.

కరీంనగర్‌కు చెందిన స్ఫూర్తి ఫౌండేషన్‌, పీజేటీఎస్‌ఏయూ మధ్య కూడా మరో అవగాహన ఒప్పందం కుదిరింది. పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్‌, స్ఫూర్తి ఫౌండేషన్ ఛైర్మన్‌ కె.జగన్మోహన్‌ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కీలక వ్యవసాయ పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపుపై కలిసి పనిచేస్తామని ఇరు సంస్థలు పేర్కొన్నాయి.

ఇవీ చూడండి : 'ఆర్టీసీపై భేటీ సమయంలో.. గుండె వేగంగా కొట్టుకుంది'

ABOUT THE AUTHOR

...view details