తెలంగాణ

telangana

ETV Bharat / state

పదోతరగతి విద్యార్థులకు 'పరీక్షే'

పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 19 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల భవిష్యత్​కు కీలకమైన పదోతరగతి పరీక్షలు... అవస్థల మధ్య రాయాల్సిన పరిస్థితి తలెత్తింది. గాలి, వెలుతురు లేమి, ఫర్నీచర్​ కొరత, ఉక్కపోత వంటి ఇబ్బందులతో పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సమస్యలపై ప్రత్యేక కథనం.

By

Published : Mar 13, 2020, 7:52 PM IST

no minimum facilities in tenth class exam halls at nizamabad district
పదోతరగతి విద్యార్థులకు 'పరీక్షే'

పదోతరగతి విద్యార్థులకు 'పరీక్షే'

పదో తరగతి పరీక్షలు విద్యార్థుల ఉజ్వల భవితవ్యానికి కీలక ఘట్టం. అయితే పరీక్షలు రాసే కేంద్రాలు వారి భవిష్యత్​కు గండి కొట్టేలా కనిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం, ప్రభుత్వాల నిర్లక్ష్యం... వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఏళ్లతరబడి అరకొర వసతుల మధ్యే విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయాల్సి వస్తోంది. ప్రతి ఏటా అవే సమస్యలు వేధిస్తున్నా... అధికారులు మాత్రం మిన్నకుంటున్నారు. దీనితో సరైన వెలుతురు లేకపోవడం, తిరగని ఫ్యాన్లు, బెంచీలు లేక కింద కూర్చొని పరీక్షలు రాయాల్సి వస్తోంది.

ఇందూరు వివరాలిలా...

నిజామాబాద్​ జిల్లాలో మొత్తం 503 పాఠశాలలు ఉన్నాయి. పదోతరగతి పరీక్షల కోసం 136 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా... 12,013 మంది బాలురు, 11,507మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 279 పాఠశాలలు ఉండగా.. 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 6,231మంది బాలురు, 6,520మంది బాలికలు పరీక్షలు రాయబోతున్నారు. అయితే చాలా పాఠశాలలో డెస్క్ బెంచీల కొరత తీవ్రంగా ఉంది. కింద కూర్చొని విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది. అధిక శాతం పాఠశాలలో కిటికీలు, తలుపులు సరిగ్గా లేవు. అలాగే కొన్ని పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేక, మరికొన్నింటిలో ఫ్యాన్లు లేక విద్యార్థులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలంలో విద్యార్థుల ఇబ్బందులు మరింత అధికం కానున్నాయి. ఇవి కాకుండా సరైన వెలుతురు లేకపోవడం కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. అవస్థల మధ్య పరీక్షల మీద దృష్టి కేంద్రీకరించలేకపోతామని.. కనీస వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఏటా ఇవే సమస్యలు ఎదురవుతున్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పరీక్షల లోపు కనీస వసతులు ఏర్పాటు చేసి ఇబ్బందులు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. లేదంటే వసతుల లేమి ప్రభావం పరీక్షలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details