ఇందూరు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిలిపేసిన ఓపీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు క్యాజువాలిటీలోనే అన్ని విభాగాల వైద్యులు కూర్చొని అత్యవసర ఓపీ చూసేవారు. ఇక నుంచి ఎప్పటిలాగే ఓపీ చీటీ రాయించుకొని ఏ విభాగానికి చెందినవారు ఆ అంతస్తులో ఉండే వైద్య నిపుణుల వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మొన్నటి వరకు 300 ఉన్న ఓపీ కాస్త పెరిగి నిన్న 470కి చేరింది.
అంతా సన్నద్ధం...
శస్త్ర చికిత్సలు చేయడానికి ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేశారు. కొవిడ్-19 విభాగం ఐసోలేషన్ వార్డుకు కొత్త కేసులు రాకపోవడం, వార్డు ఖాళీ కావడం వల్ల అక్కడ పనిచేసిన సిబ్బందిని తిరిగి వారి వార్డులకు, ఆపరేషన్ థియేటర్లకు పంపించారు.