తెలంగాణ

telangana

మూడు రాష్ట్రాల సరిహద్దులో గెలుపెవరిది?

By

Published : Apr 9, 2019, 11:28 AM IST

Updated : Apr 9, 2019, 3:58 PM IST

మూడు రాష్ట్రాల సరిహద్దు.. మూడు భాషల సంగమం.. ఓ వైపు భూతల్లికి కుంకుమ అద్దినట్లు ఎర్రరాతి నేలలు.. మరో వైపు నల్లనేలల నిగారింపు. అటు మంజీర ఝరులు.. ఇటు కరవు ఛాయలు.. ఇదీ జహీరాబాద్ నియోజకవర్గ ముఖచిత్రం. భాషా.. సంస్కృతి.. భౌగోళికం.. వాతవరణంలో భిన్నత్వం దీని ప్రత్యేకత. లోక్​సభ పోరులో పార్టీల బలాబలాలు, గెలుపు అవకాశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

జహీరాబాద్ పార్లమెంటు పరిస్థితి

తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుగా ఉన్న జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం భిన్న సంస్కృతులకు నిలయం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 3, నిజామాబాద్ జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలను కలిపి జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఏర్పాటు చేశారు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కర్ గెలిచారు. 2014లో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ విజయం సాంధించారు. తెరాస నుంచి మరోసారి బీబీపాటిల్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున మదన్ మోహన్ రావు, భాజపా నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీ ఉన్నారు.

జహీరాబాద్ పార్లమెంటు పరిస్థితి


రెండోసారి గెలుపే లక్ష్యంగా ఎంపీ బీబీ పాటిల్‌ పావులు కదుపుతున్నారు. అధినేత ప్రచార సభతో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాలు కైవసం చేసుకొని బలమైన శక్తిగా ఎదిగింది. ఎల్లారెడ్డిలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్ రెడ్డి కూడా తెరాసకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా బలమైన లింగాయత్ సామాజిక వర్గం అండ పాటిల్​కు కలిసొచ్చే అంశాలు. సింగూర్ నుంచి దిగువకు నీటిని తరలించడం, ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడం, నిమ్జ్‌ పురోగతికి సరైన చొరవ చూపకపోవడం ప్రతికూలాంశాలుగా కనిపిస్తున్నాయి. తెలుగులో సరిగా మాట్లాడలేరని, ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు కూడా ఉన్నాయి.


గతంలో భాజపా మద్దతుతో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌ మోహన్‌రావు... అనంతరం కాంగ్రెస్​లో చేరి బరిలో నిలిచారు. యువత, నిరుద్యోగ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం సాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిచయాలు, ఉపాధి కల్పన కార్యక్రమాలు, మైనార్టీ ఓటు బ్యాంకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. రాహుల్‌ గాంధీ సభతో శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చినట్టు భావిస్తున్నారు. అయిదేళ్ల కాలంలో బీబీ పాటిల్‌ చేసిందేమీ లేదని విమర్శిస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో పర్యటించకపోవడం, అధికార పార్టీలోకి సాగుతున్న వలసలు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తొలిసారిగా లోక్​సభకు పోటీ చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సుదీర్ఘ రాజకీయానుభవం, మోదీ ఇమేజ్ అనుకూలాంశాలుగా భావిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీకి క్యాడర్ లేకపోవడం, శాసనసభ ఎన్నికల్లో నారాయణఖేడ్‌ మినహా అన్ని చోట్లా భాజపా అభ్యర్థులు ధరావతు కోల్పోవడం, అతను కూడా కాంగ్రెస్​లో చేరడం ప్రతికూలాంశాలు.

ఇవీ చూడండి: సమయం లేదు మిత్రమా మిగిలింది ఈ ఒక్క రోజే

Last Updated : Apr 9, 2019, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details