తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘాటెక్కిన ఉల్లి... సామాన్యులకు కన్నీళ్లే గతి..!!

ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల వేగం చూస్తుంటే రెక్కలు వచ్చిన పక్షి ఎగిరినట్లు పెరుగుతున్నాయి. అత్యధికంగా సాగుచేసే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో అతివృష్టి కారణంగా చేతికొచ్చిన పంట వర్షార్పణం అయి.. ఇప్పుడు ఉత్పత్తి లేక డిమాండ్​ పెరిగింది. పేద, మధ్యతరగతి వారికి అందని ద్రాక్షలా... కోయకుండానే కన్నీళ్లు పెట్టించే స్థాయిలో ఉల్లిధరలు ఎగిసిపడుతున్నాయి.

By

Published : Dec 5, 2019, 8:01 PM IST

Updated : Dec 24, 2019, 12:29 PM IST

onion-rates-increased-all-time
ఘటెక్కిన ఉల్లి... సామాన్యులకు కన్నీళ్లే గతి..!!

ఘటెక్కిన ఉల్లి... సామాన్యులకు కన్నీళ్లే గతి..!!

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో దేవరకద్ర, నారాయణపేట, అలంపూర్, గద్వాల కొల్లాపూర్​ నియోజకవర్గాలలో ఉల్లిని అత్యధికంగా సాగు చేస్తారు. కరువు కాలం వచ్చినా తక్కువ నీటితో ఉల్లి సాగు చేయాలని ఈ ప్రాంతాల రైతులు ధరలతో సంబంధం లేకుండా ఏట సుమారుగా 20వేల ఎకరాలలో సాగు చేసి వ్యాపారస్తులకు, వినియోగదారులకు అందిస్తారు. ​

ఉల్లి క్రయవిక్రయాలు ఇలా...

కొల్లాపూర్​ నియోజకవర్గంలో సాగుచేసిన ఉల్లిని నేరుగా హైదరాబాద్​లోని మలక్​పేట మార్కెట్లో...​గద్వాల, అలంపూర్​ నియోజకవర్గాల్లో సాగుచేసే ఉల్లిని కర్నూల్​ మార్కెట్​లో విక్రయిస్తారు. దేవరకద్ర నారాయణపేట జిల్లాలో సాగుచేసే రైతులు మాత్రం మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాలను అనుసంధానం చేసే దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లోనే అమ్ముతారు.

ప్రధాన మార్కెట్లలో ఉల్లికి డిమాండ్​ ఏర్పడటంతో స్థానిక మార్కెట్​గా ప్రసిద్ధి చెందిన ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​పై ప్రభావం చూపింది.
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో ఉల్లిధర కింటకు పెరిగింది ఇలా...

కనిష్టం గరిష్టం
నవంబర్ మొదటివారం రూ.2000 రూ. 3000
రెండో వారం రూ.2600 రూ.3400
మూడో వారం రూ.3000 రూ.4300
నాల్గో వారం రూ.5050 రూ. 7390
డిసెంబర్ మొదటి వారం రూ.6000 రూ.8600


పెరిగిన ఉల్లి ధరలతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు చూడటం తప్ప కొనలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20రూపాయలకు కిలో ఉన్న ఉల్లి ధర.. నెల రోజుల వ్యవధిలోనే వందకు పెరగడంతో పేద, మధ్యతరగతి వారికి కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోందని ఆవేదన చెందుతున్నారు.

ఉల్లి కేంద్రాల ఏర్పాటు

పెరిగిన ఉల్లి ధరలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌక ధరల దుకాణాల ద్వారా పేద, మధ్య తరగతి వినియోగదారులు కొనుగోలు చేసే స్థాయిలో రాయితీ ధరలతో ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : Dec 24, 2019, 12:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details