తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ధ్రువపత్రం వద్దట.. ప్రైవేటే ముద్దట..

కష్టపడి చదివారు...గురుకుల పాఠశాలలో సీటు సాధించారు. ప్రవేశం కోసం వస్తే ఫిట్​నెస్​ ధ్రువపత్రం కావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికెళ్లి పత్రాలు తీసుకొస్తే అవి చెల్లవంటూ ఓ ప్రైవేట్​ ప్రయోగశాల పేరు చెప్పి పంపిస్తున్నారు మహబూబ్​నగర్​ జిల్లాలోని సాంఘిక సంక్షేమ పాఠశాలల అధికారులు. ఇలా పిల్లల తల్లిదండ్రులతో రూ. 1000 వరకు ఖర్చు పెట్టిస్తున్నారు. కమిషన్​ కోసమే అధికారులు ఇలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

By

Published : May 28, 2019, 11:55 PM IST

విద్యార్థులు, తల్లిదండ్రులు

పరీక్షల పేరుతో వేలు దండుకుంటున్నారు

ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఉద్యోగమైనా... విద్యాలయాల్లో ప్రవేశం అయినా కచ్చితంగా ప్రభుత్వ సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి వైద్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. కానీ.. మహబూబ్​నగర్ జిల్లాలో​ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధికారులు మాత్రం వీటిని విస్మరించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గ్రూప్-1 నుంచి మొదలు పెడితే విద్యార్థులు అడ్మిషన్ కోసం కావల్సిన పరీక్షలు చేసేందుకు వసతులు ఉన్నాయి. వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ప్రధానోపాధ్యాయులు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ప్రయోగశాల యజమానిని పిలిపించి తక్కువ ధరకు చేయాలని చెప్పి బాధ్యతలను అప్పగించారు. కనీసం బహిరంగంగా ప్రకటన ఇవ్వకుండా ఒక్కరికే బాధ్యతలు అప్పగించారు.

సర్కార్​ పత్రాలు చెల్లవంటా

ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి జారీ చేసిన ధ్రువపత్రాలను తీసుకెళ్తే వాటిని తిరస్కరించి ప్రైవేట్ ప్రయోగశాలకే పంపిస్తున్నారు గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్లు. కేవలం వారు సూచించిన ప్రయోగశాలకు మాత్రమే వెళ్లాలని ఇతర వాటికి వెళ్లిన తీసుకోబోమని స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రైవేటు ప్రయోగశాలలో, ప్రైవేటు వైద్యులు ఇచ్చిన నివేదికలపై మాత్రం ప్రభుత్వ వైద్యులు సంతకం ఉండాలని సూచించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కో విద్యార్థికి రూ.1000

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధికారులు తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా మారాయి. ప్రైవేట్ ప్రయోగశాలలో చేస్తున్న పరీక్షలకు రూ.1780 అవుతుందని బిల్లు ఇచ్చి.. ఇందులో రూ.980 డిస్కౌంట్ ఇస్తున్నామని, రూ.800 చెల్లించాలని రశీదులు ఇస్తున్నారని తెలిపారు. దంత సంబంధిత పరీక్షలకు రూ.50, కంటికి సంబంధించిన పరీక్షలకు మరో రూ.100 తీసుకుంటున్నారు. రక్త పరీక్షలు ప్రయోగశాలల్లో సాగినప్పటికీ దంత, కంటి పరీక్షలకు వేరువేరు వైద్యుల వద్దకు వెళ్లాలి. ఇక వీటన్నిటిపై సంతకం కోసం ప్రభుత్వ వైద్యుడి వద్దకు వెళ్లాల్సి వస్తోంది.

విచారణ

అందుబాటులో ఉన్న వనపర్తి, షాద్ నగర్, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకువస్తే చెల్లవంటూ ప్రైవేటు ప్రయోగశాల పేరు రాసి ఫారంతో పాటు అందించారని బాధితులు వాపోతున్నారు. గురుకుల పాఠశాల అధికారులు ప్రైవేట్​ ప్రయోగశాల యజమానితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ విషయమై విచారణ జరపాలని విద్యార్థిసంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఇవీ చూడండి: అవినీతిపై పోరాడేందుకు లోక్​పాల్​ సూపర్​ ఆఫర్​

ABOUT THE AUTHOR

...view details