తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2020, 10:09 AM IST

ETV Bharat / state

యజమానికి ప్రాణమిచ్చి... తానూ మరణించింది..

కుక్కలు విశ్వాసానికి రూపమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త ఆదరిస్తే చాలు వాటి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యజమానుల్ని కాపాడుకుంటాయి. అలాంటి సంఘటనే ఇది. ఖమ్మం జిల్లా కల్లూరులో తన యజమానిని కాపాడి తానూ ప్రాణాలు కోల్పోయింది.

dog died and the owner safe in kallur khammam
యజమానికి ప్రాణమిచ్చి... తానూ మరణించింది

తనను ఎంతో ప్రేమాభిమానాలతో పెంచిన యజమానిని ఓ శునకం పెనుప్రమాదం నుంచి కాపాడింది. ఓ విషసర్పంతో పోరాడి.. ఆయన్ను రక్షించి తన ప్రాణాలను అర్పించి విశ్వాసాన్ని చాటుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం గోపాలకుంట ప్రాంతంలో జరిగింది. శునకం యజమాని కిశోర్‌ తన ఇంటిలోని వెనుక గదిలో శనివారం సాయంత్రం నిద్రిస్తున్నారు.

ఆ సమయంలో ఆయన మంచం కిందకు ఓ గోధుమవన్నె తాచుపాము చేరింది. దానిని గమనించిన పెంపుడు కుక్క స్నూపీ అరుస్తూ యజమానిని నిద్రలేపింది. కిశోర్‌ నిద్ర లేచేసరికి అతన్ని కాటు వేసేందుకు పాము రాగా.. వెంటనే కుక్క దాన్ని అడ్డుకుని నోటితో పట్టుకుంది. వెంటనే విషసర్పం శునకాన్ని కాటు వేసింది. అయినా వదలకుండా కుక్క పామును ఇంటి బయటకు లాక్కొచ్చింది. ఈలోపు కిశోర్‌ కర్ర తెచ్చి పామును కొట్టి చంపారు. పాము కాటుకు గురైన స్నూపీని పశువైద్యశాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించింది. తన ప్రాణాలు కాపాడటానికి పెంపుడు శునకం సర్పంతో పోరాడి ప్రాణాలొదిలిందని కిశోర్‌, అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి :రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం

ABOUT THE AUTHOR

...view details