తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2022, 4:41 AM IST

Updated : Apr 7, 2022, 8:43 AM IST

ETV Bharat / state

నిధుల సమీకరణకు సమాయత్తమైన రాష్ట్ర సర్కారు

Loans: కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 15వేల కోట్లు రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకుకు సర్కారు ప్రతిపాదనలు పంపించింది. రైతుబంధు చెల్లింపుల నేపథ్యంలో మే నెలలోనే ఏకంగా 8 వేల కోట్లు అప్పుగా తీసుకోనుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే వారం నుంచి అప్పులు ప్రారంభించనుంది.

వచ్చే వారం నుంచి అప్పులు ప్రారంభించనున్నరాష్ట్ర ప్రభుత్వం
వచ్చే వారం నుంచి అప్పులు ప్రారంభించనున్నరాష్ట్ర ప్రభుత్వం

నిధుల సమీకరణకు సమాయత్తమైన రాష్ట్ర సర్కారు

Loans: నిధుల సమీకరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 53 వేల 970 కోట్లు రుణంగా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు 2022-23 బడ్జెట్‌లో పొందుపరిచారు. రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లను వేలం వేసి ఈ మొత్తాన్ని సమకూర్చుకోనుంది. రుణాల కోసం శుక్రవారం బాండ్లు జారీ చేసి మంగళవారం రోజు ఆర్బీఐ ద్వారా వేలం వేస్తారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో... మొదటి త్రైమాసికంలో ఆయా రాష్ట్రాలను సంప్రదించి రిజర్వ్ బ్యాంకు అంచనాలను రూపొందించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రాల అవసరాల ఆధారంగా రుణాలు తీసుకోనున్నారు. అన్ని రాష్ట్రాలు మూడు నెలల్లో లక్షా 90 వేల 375 కోట్లు అప్పుగా తీసుకోనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అందులో తెలంగాణ రాష్ట్ర వాటా 15వేల కోట్ల రూపాయలుగా ఉంది.

మొత్తం 53వేల కోట్ల రుణ ప్రతిపాదనలకుగాను.. రాష్ట్ర ప్రభుత్వం మొదటి త్రైమాసికంలో 15వేల కోట్లు అవసరంగా రిజర్వ్ బ్యాంకుకు నివేదించింది. ఏప్రిల్ లో 3 వేల కోట్లు, మేలో 8 వేల కోట్లు, జూన్‌లో 4 వేల కోట్లు ఉన్నాయి. మే నెలాఖరు లేదా జూన్ నెల మొదట్లో వానాకాలం రైతుబంధు చెల్లింపులు చేయనున్నారు. ఇందుకోసం 7 వేల 500 కోట్లకు పైగా నిధులు అవసరం కానున్నాయి. పన్నులు, ఇతరత్రాల రూపంలో ఖజానాకు నెలకు సగటున 9 నుంచి 10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. జీతాలు, పింఛన్ల చెల్లింపులతో పాటు వడ్డీ చెల్లింపులు సహా ఇతరత్రాలకు నిధులు వినియోగించాల్సి ఉంటుంది. దీంతో పక్షం రోజుల్లోనే రైతుబంధు కోసం 7 వేల 500 కోట్లు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్థికంగా సర్దుబాటు తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా రుణాలు తప్పని పరిస్థితి కావటంతో... మేలోనే ఏకంగా 8 వేల కోట్లు అప్పు తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు నివేదించింది.

ఇదీ చదవండి:ప్రజారోగ్య వైద్యంలో గుణాత్మక పురోగతి: సీఎం కేసీఆర్

Last Updated : Apr 7, 2022, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details