తెలంగాణ

telangana

అతని ఫొటోకు... చిత్రమే మురిసిపోతోంది!

By

Published : Aug 22, 2019, 12:30 PM IST

ఓ యువకుడు అంతరించిపోతున్న పక్షి జాతులకు తన ఫొటోగ్రఫీతో ప్రాణం పోస్తున్నాడు. జీవ వైవిద్య సంరక్షణకు తనవంతు సాయం అందిస్తున్నాడు.

గిరీష్ గ్రిల్స్... ఓ పక్షి ప్రేమికుడు!

గిరీష్ గ్రిల్స్... ఓ పక్షి ప్రేమికుడు!

పచ్చని చెట్లు... అందమైన సెలయేళ్లు.... పక్షుల కిలకిలారావాలు... ప్రకృతి సోయగాలలో ఉండే సౌందర్యం తీరే వేరు. రానురాను యాంత్రిక జీవనానికి దగ్గరవుతున్న మనిషి... ప్రకృతికి దూరమైపోతున్నాడు. స్వేచ్ఛగా గాలిలో తిరగాల్సిన ఎన్నో పక్షిజాతులు భూతాపాన్ని తట్టకోలేక అంతరించిపోతున్నాయి. అలాంటి పక్షులను, వాటి సౌందర్యాన్ని తన ఫొటోల్లో భద్రపరుస్తున్నాడు ఓ యువకుడు. వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నాడు.

ఇష్టంతో పేరు మార్చుకున్నాడు

గిరీష్ గ్రిల్స్.. ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంటకు చెందిన వ్యక్తి. చదివింది బిటేక్. రాణిస్తోంది ఫొటోగ్రఫీలో..! ప్రపంచ ప్రఖ్యాత సాహసికుడు, అడ్వెంచరెస్ స్పెషలిస్ట్ అయిన బేర్ గ్రిల్స్​ను అమితంగా ఇష్టపడే గిరీష్... అతనిలా ప్రకృతితో మమేకమై తన భవిష్యత్​ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. గిరీష్ గ్రిల్స్​గా తన పేరును మార్చుకుని... చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన పక్షులపై అధ్యయనం ప్రారంభించాడు.

చదివింది బిటెక్​ కానీ...

చదువుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఆ పక్షుల జీవనవిధానం గురించి తెలుసుకునేవాడు. క్రమంగా వీటిపై ఆసక్తి పెరిగింది. చదువుకున్నది బీటెక్ అయినా ఉద్యోగం వైపు మళ్లకుండా బర్డ్ వాచర్​గా కెరీర్​ను ప్రారంభించాడు. క్రమేపీ పక్షుల జీవనవిధానంపై పట్టు సంపాదిస్తూ...కేవలం కంటిచూపుతోనే 500 రకాల పక్షులను గుర్తించి...వాటి గురించిన పూర్తి వివరాలు చెప్పగలిగే స్థాయికి చేరుకున్నాడు. మరో వైపు జీవవైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తున్న పక్షుల సంఖ్య... ప్రపంచీకరణ నీడలో తగ్గిపోతుండటం గురించి అధ్యయనం చేసిన గిరీష్... ఇందుకు కారణమవుతున్న అంశాలపై పరిశోధన సాగించాడు.

రసాయనాలపై అవగాహన

పరిమితికి మించి రసాయనాల వాడకంతో పంటపొలాల్లో పక్షులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని గమనించాడు గిరీష్. దీనిపై స్థానికంగా ఉన్న రైతులకు అవగాహన కల్పించటం ప్రారంభించాడు. మితిమీరిన ప్లాస్టిక్ వాడకం... పక్షుల పాలిట యమపాశంగా మారుతోందనే విషయాన్ని ప్రచారం చేస్తున్నాడు. పంటలను తొలిచే పురుగులను తినటం ద్వారా పక్షులు చేస్తున్న మేలును రైతులకు అర్థమయ్యేలా వివరించేందుకు సామాజిక మాధ్యమాల్ని వేదికగా చేసుకున్నాడు. గ్రిల్స్ ఫొటోగ్రఫీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో...పక్షుల ప్రత్యేకతలను వివరిస్తున్నాడు.

రెండు లక్షల ఫొటోలు తీశాడు

దేశంలోని వివిధ ప్రాంతాలను, ప్రఖ్యాత బర్డ్ సాంక్చుయరీలను సందర్శించినపుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఇప్పటివరకూ అతను తీసిన ఫోటోల సంఖ్య రెండు లక్షలు. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్-పెటాకు గిరీష్ తిరుపతిలో ప్రతినిధిగా సేవలందిస్తున్నాడు. పక్షులపై ప్రేమతో మొదలైన గిరీష్ ప్రయాణం...ఈ రోజు తన కళతో...పదిమందిని ప్రకృతి పట్ల ఆకర్షించేలా మారడం అభినందనీయం.

ఇదీ చదవండి:ఈ శతాబ్దంలో మనుషులు బలిగొన్న పులులు 2,300

ABOUT THE AUTHOR

...view details