తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగుల వయోపరిమితి పెంచడం చరిత్రాత్మక తప్పిదం: ఆర్.కృష్ణయ్య

ఉద్యోగుల వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,93,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన పోస్టులను.. అక్రమ ప్రమోషన్లతో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు.

By

Published : Mar 26, 2021, 10:54 PM IST

krishnaiah fires on trs government, krishnaiah about recruitment
వయోపరిమితిపై ఆర్ కృష్ణయ్య, ఉద్యోగ ఖాళీలపై ఆర్ కృష్ణయ్య

ఉద్యోగుల వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మక తప్పిదమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ఈ నిర్ణయంతో ప్రజా ధనం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో ఐకాస ఛైర్మన్ నీలా వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నిరుద్యోగులను మోసం

రాష్ట్రంలో 1 లక్షా 93 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ లెక్కలు చెబుతున్నప్పటికీ... 50 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన పోస్టులను.. అక్రమ ప్రమోషన్ల పేరుతో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు.

పోస్టుల ఖాళీలు

ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల ఉపాధ్యాయ పోస్టులు, ఎయిడెడ్ స్కూళ్లలో 4,900 పోస్టులు, గురుకులాల్లో 10 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఖాళీలపై సరైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతను పాలన రంగంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

ఉద్యమిస్తాం

రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి... వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ, విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:శంషాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై చేపల మార్కెట్: తలసాని

ABOUT THE AUTHOR

...view details