Ponguleti Srinivas Reddy Political Carrier :ఒక కాంట్రాక్టర్గా మాత్రమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజకీయ పలుకుబడి ఉన్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasreddy). 2013 ఫిబ్రవరి 23న రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన 2014లో ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరో 3 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు.
కొలువుదీరనున్న కొత్త కేబినెట్ - ఖమ్మం నుంచి మంత్రి పదవి ఎవరికో?
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో తన పార్టీ ఎమ్మెల్యేలు కారెక్కారు. అనంతరం రెండేళ్ల పాటు అదే పార్టీలో కొనసాగిన ఆయన మాజీ సీఎంకేసీఆర్(KCR) ఆహ్వానం మేరకు 2016 మే 4న గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంత్రి కేసీఆర్తోనేనని పొంగులేటి బలంగా విశ్వసించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి దక్కిన ఫలితాలు, ఆ తర్వాత పరిణామాలు పార్టీకి పొంగులేటికి మధ్య అగాధం పెంచుతూ వచ్చాయి.
Ponguleti Challages KCR on Khammam Elections :2018 ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ గెలుపొందగా మిగిలిన 9 స్థానాల్లో పరాజయం పాలైంది. ఈ క్రమంలో పొంగులేటికి బీఆర్ఎస్కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన తనను కాదని నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వడంతో పొంగులేటి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ పొంగులేటి రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని భరోసా ఇచ్చారు.