తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2020, 8:12 AM IST

ETV Bharat / state

ఉపాధి లేక విలవిల... పల్లెలకు తరలిపోతున్న కుటుంబాలు

కరోనా మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజల ఆదాయంపై కోలుకోలేని దెబ్బకొట్టింది. లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులు చక్కబడతాయని భావించి ఏదోలా గడిపారు. అయితే లాక్‌డౌన్ సడలింపులతోనూ పరిస్థితి పెద్దగా మారకపోవడం.. హైదరాబాద్‌ నగరంలో లాక్‌డౌన్ విధించనున్నట్లు వార్తలు వస్తుండడం మరింత కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో దిక్కులేక నగరాన్ని వీడుతున్నారు.

hyderabad lock down
hyderabad lock down

పట్నం బతుకులు తలకిందులవుతున్నాయి. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని గట్టెక్కించుకోవాలని నగరానికి వచ్చిన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఆదాయంపై కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. నెలకు రూ. పదిహేను, ఇరవై వేల ఆదాయం ఉండే అల్పాదాయవర్గాల వారు లాక్‌డౌన్‌ అనంతరం పరిస్థితులు చక్కబడతాయని ఆశించి ఇప్పటివరకు ఏదోలా గడిపారు. జూన్‌ గడిచిపోయినా చిన్నచిన్న పరిశ్రమలు, వస్త్ర దుకాణాలు, బేకరీలు, రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్‌లు, సినిమా హాళ్లు ప్రారంభం కాలేదు. పరోక్షంగా ఉపాధికి కారణమయ్యే సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఇతర పరిశ్రమలు కూడా పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. మధ్యతరగతి ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీనికితోడు మరోసారి హైదరాబాద్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వార్తలు వస్తుండడం వారిని మరింత కలవరపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో దిక్కులేక నగరాన్ని వీడుతున్నారు.

రూ.6 వేలతో నెట్టుకురావడం కష్టమే

సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో పనిచేసే మల్లేశ్‌ నెల ఆదాయం రూ.12 వేలు. వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాల నుంచి ఏడేళ్ల క్రితం వచ్చి ఇక్కడ జీవిస్తున్నాడు. కరోనా అతడి కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. రెస్టారెంట్‌ నడవకపోవడంతో రూ.6 వేలు మాత్రమే వేతనం ఇస్తామని నిర్వాహకులు తెలిపారని, ఇంటి అద్దె రూ.3,500 చెల్లించాల్సి రావడం, ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని సాకడం కష్టంగా మారడంతో నగరం విడిచిపోతున్నామని తెలిపాడు. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేసుకుని బతకాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈయనే కాదు ఆ రెస్టారెంట్‌లో పనిచేసే ఇరవైమందిదీ ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లో ఇల్లు ఖాళీ చేసిన మహబూబ్‌నగర్‌కు చెందిన మరో కుటుంబానిదీ అలాంటి పరిస్థితే. అమీర్‌పేటలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ వచ్చే రూ.15 వేల ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతడికి నిర్వాహకులు రూ.8 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో విధిలేక సొంతూరు వెళ్లిపోతున్నట్లు తెలిపాడు.

గృహాల యజమానులకూ కష్టాలే

ఇంట్లో ఒకటో రెండో పోర్షన్లు అద్దెకిచ్చి ఆ ఆదాయం మీద ఆధారపడిన ఇళ్ల యజమానులూ సంకట స్థితిలో పడ్డారు. మూడు నెలల నుంచి కిరాయి సక్రమంగా వసూలు కాకపోగా ఇప్పుడు ఇళ్లు ఖాళీ అవుతుండటం వారిని కష్టాల్లోకి నెడుతోంది. చింతలబస్తీలో నివసించే కూర్మయ్య తన ఇంటిపై రెండు మిద్దెలు నిర్మించి అద్దెకు ఇచ్చారు. ఒక్కోదానిపై రూ.ఐదు వేల బాడుగ వస్తుండగా తాను మరో రూ.10 వేలు సంపాదిస్తున్నాడు. ఏప్రిల్‌లో ఒక ఇల్లు ఖాళీ అయింది. దానికి ఇప్పుడు గతంలో వచ్చినంత బాడుగ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. పైగా ఈ నెలలో మరొకటి ఖాళీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఉద్యోగులు కొందరు జీతాల్లో కోతలు పడడంతో తక్కువ కిరాయిలు ఉండే శివారు ప్రాంతాలకు వెళ్లిపోడానికి సిద్ధపడుతున్నారు.

చింతలబస్తీలోని ఓ వీధిలో వరసగా మూడు ఇళ్లకు టులెట్‌ బోర్డులు వేలాడదీసి ఉండగా ఆ పక్కనే మరో మూడు ఇళ్లు ఖాళీగా కనిపించాయి. ఇక్కడ సాధారణంగా రూ.4 వేల నుంచి రూ.6 వేలు చెల్లిస్తే ఒక పడకగది ఉన్న ఇల్లు అద్దెకు దొరుకుతుంది. ఓ మోస్తరు ఆదాయం ఉన్న వారు ఎంచుకునే బస్తీ ఇది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఏ వీధిలో చూసినా అద్దె బోర్డులే కనిపిస్తున్నాయి. కరోనా బతుకుల్ని ఆగం చేసేసింది. ఉపాధి పనులు గాడినపడక పోవడంతో కొందరు రూ.రెండు, మూడు వేలకు అద్దెకు గదులు దొరికే మేడిపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరికొందరు బతుకుజీవుడా అని సొంత గ్రామాలకు తరలిపోతుండటంతో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details