రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల 20 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు కేటీఆర్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రపంచ దేశాల నుంచి ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు.
తెలంగాణ ప్రగతిని విశ్వవేదికపై చాటడం, పెట్టుబడుల సాధన, పారిశ్రామికవేత్తలతో భేటీలు, వివిధ సంస్థల అధిపతులతో సమావేశాల కోసం మంత్రి వెళ్తున్నారు. 2018లోనూ కేటీఆర్ దావోస్ వెళ్లారు. అప్పటి పర్యటనలో టెక్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్మహీంద్రా, ఎండీ గుర్నానిలతో సమావేశమై వరంగల్లో ఐటీ ప్రాంగణం పెట్టాలని కోరగా... ఇటీవలే అది సాకారమైంది. నోవార్టిస్, లాకీడ్ మార్జిన్ తదితర సంస్థలతోనూ చర్చలు జరిగాయి. తాజా పర్యటనలో మంత్రి వెంట తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, డిజిటల్ మాధ్యమ సంచాలకుడు కొణతం దిలీప్లు ఉంటారు.