తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2020, 8:01 AM IST

ETV Bharat / state

స్వతంత్ర వ్యవసాయ సంస్థలు ఐసీఏఆర్‌లో విలీనం!

జాతీయ వ్యవసాయ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. స్వతంత్ర ప్రతిపత్తిలో నడుస్తున్న 11 సంస్థలను ఐసీఏఆర్​లో పరిధిలోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఫలితంగా హైదరాబాద్‌లోని మేనేజ్‌, ఎన్‌ఐపీహెచ్‌ఎంలు స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోనున్నాయి.

ICAR
స్వతంత్ర వ్యవసాయ సంస్థలు ఐసీఏఆర్‌లో విలీనం!

దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి(ఏబీ)తో నడుస్తున్న జాతీయ వ్యవసాయ సంస్థలపై కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మొత్తం 11 సంస్థలపై రతన్‌ పి.వటల్‌ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. వీటిలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ’(మేనేజ్‌), జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐపీహెచ్‌ఎం)లు ఉన్నాయి. వీటికి పూర్తిస్థాయి స్వతంత్ర ప్రతిపత్తి హోదాను తొలగించి ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌)పరిధిలోకి తేవాలని కేంద్ర వ్యవసాయశాఖ సూచించింది. ఈ రెండింటితో పాటు చౌదరి చరణ్‌సింగ్‌ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్థను కూడా ఇలాగే మండలి కిందకు తేవాలని కోరింది. మొత్తం 11లో ఈ మూడు సంస్థలకు మాత్రమే స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించాలని సిఫార్సు చేయడం గమనార్హం.

  • మరో 3 సంస్థలు.. చిన్న రైతుల వ్యవసాయ కన్సార్షియం(సీఫాక్‌), జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ), జాతీయ సహకార శిక్షణ మండలికి కేంద్ర బడ్జెట్‌ నుంచి నిధుల కేటాయింపు నిలిపివేయాలి.
  • కేంద్ర ఉద్యాన సంస్థను, జాతీయ కొబ్బరి అభివృద్ధి మండలిని జాతీయ ఉద్యాన మండలి పరిధిలోకి తేవాలి.
  • మొత్తం 11 జాతీయ వ్యవసాయ సంస్థల్లో రెండింటిని యధావిధిగా కొనసాగించాలి. మరో అయిదింటిని 2 సంస్థలుగా మార్చేయాలి. మిగిలిన 4 సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తగ్గించాలని కేంద్ర వ్యయ మంత్రిత్వశాఖ ప్రభుత్వానికి సూచించింది.

కమిటీ వద్దన్నా...

స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలపై వటల్‌ కమిటీ అధ్యయనం చేసి ఇచ్చిన సిఫార్సులకు భిన్నంగా కేంద్ర వ్యయ మంత్రిత్వశాఖ(డీఓఈ) విడిగా మరోరకంగా సిఫార్సులు చేయడం గమనార్హం. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లోని మేనేజ్‌, ఎన్‌ఐపీహెచ్‌ఎంలు ప్రత్యేక లక్ష్యాలతో పనిచేస్తున్నందున వాటిని యథావిధిగా కొనసాగించాలని వటల్‌ కమిటీ సూచించింది. డీఓఈ మాత్రం ఈ సంస్థలు రెండూ వ్యవసాయ పరిశోధన అంశాలపైనే పనిచేస్తున్నందున విడిగా అవసరం లేదని, ఐసీఏఆర్‌ పరిధిలోకి మార్చాలని సూచించడం గమనార్హం. ఐసీఏఆర్‌ పరిధిలోకి మారిస్తే సంస్థలు ప్రాధాన్యం కోల్పోయి పనితీరుపై ప్రభావం పడుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిధుల కొరత సాకుతో ఈ సంస్థల అధికారాలు కుదించేలా ప్రయత్నించడం తగదని సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి:చేబదుళ్లలో తెలంగాణది ఆరో స్థానం

ABOUT THE AUTHOR

...view details