తెలంగాణ

telangana

By

Published : Jun 21, 2020, 9:33 AM IST

ETV Bharat / state

కరోనా వచ్చినా చికిత్సలో జాప్యం.. బాధితుల్లో కలవరం

కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేసి సంబంధిత ఆరోగ్యకేంద్రాలకు చేరే ప్రక్రియలో ఆలస్యం చోటుచేసుకుంటోంది. దీంతో రోగులు ఎటువంటి చికిత్సకు నోచుకోక రెండు మూడురోజులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది.

HYDERABAD CORONA NEWS
HYDERABAD CORONA NEWS

హైదరాబాద్ మహానగరం పరిధిలో నెలక్రితం వరకు కరోనా పాజిటివ్‌ వచ్చినవారిని 108 వాహనంలో తక్షణం గాంధీకి తరలించడమే కాకుండా వారున్న ప్రాంతాన్ని కట్టడి ప్రాంతం(కంటెయిన్‌మెంట్‌ జోన్‌)గా ప్రకటించేవారు. ఆ తరువాత వచ్చిన మార్పుల్లో భాగంగా సంబంధిత రోగి ఇంటి వరకే కట్టడిగా పరిగణిస్తూ వస్తున్నారు. రాజధాని పరిధిలో 50 వేల కరోనా పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కూడా రోజూ వెయ్యికుపైగా చేస్తున్నారు. దీంతో రోగుల సంఖ్య పెరుగుతున్నా వారికి సేవలందించే విషయంలో వేగాన్ని ప్రదర్శించడం లేదు.

రోగుల జాబితా ఏ రోజుకారోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ జరిగి స్థానికంగా ప్రాథమిక/నగర ఆరోగ్య కేంద్రాలకు చేరాలి. అనంతరం వారి ఇళ్లకు పారామెడికల్‌ సిబ్బంది వెళ్తారు. జర్వం, ఇతరత్రా లక్షణాలు అధికంగా ఉంటే 108లో గాంధీకి తరలించాలి. పెద్దగా లక్షణాలు లేనివారికి ఫోన్‌లో వైద్యుల సలహాతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తారు. పాజిటివ్‌ తేలినవారి పేర్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అయ్యేసరికి రెండురోజులకు పైగా పడుతోంది. దీంతో పారామెడికల్‌ సిబ్బంది కూడా వైద్యం అందించలేకపోతున్నారు. రోగులు భయంతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తే అక్కడ పడకలు లేవని చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు.

ఇళ్లలోనూ ఉండనివ్వడం లేదు

కరోనా పాజిటివ్‌ వస్తే చాలు అద్దెకు ఉన్నవారిని ఖాళీ చేసి వెళ్లమని యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. కూకట్‌పల్లిలో ఇలానే ఓ కుటుంబాన్ని అప్పటికప్పుడు ఖాళీ చేయించడంతో వారంతా ఆవేదన చెందారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌లో ఉండే ఓ యువకుడికి కరోనా వస్తే యజమాని ఇదేమాదిరి ఒత్తిడి తెచ్చారు. పోలీసుల దృష్టికి తీసుకువెళ్తానని యువకుడు చెప్పడంతో ఇంట్లో ఉండనిచ్చారు.

ఈ కేసులు పరిశీలిస్తే..

  • ఉప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి ఈనెల 17న పరీక్ష చేయించుకోగా కరోనా ఉన్నట్లు 18న తేలింది. 19న రాత్రి వరకు స్థానికంగా ఉన్న అధికారులు, వైద్య సిబ్బంది నుంచి స్పందన లేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే రెండో రోజు వచ్చి తీసుకువెళ్లారు.
  • సరూర్‌నగర్‌లో దంపతులకు వారం క్రితం కరోనా రాగా మూడు రోజలపాటు ఇంట్లోనే వైద్యం లేకుండా ఉండిపోయారు. వారి సన్నిహితులు మేయర్‌ రామ్మోహన్‌ దృష్టికి తీసుకురాగా ఆయన జోక్యం చేసుకున్న తరువాతే ఆసుపత్రికి తరలించారు.
  • ఈనెల 18న ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి ప్రాంతాలకు చెందిన కొందరు కరోనా పరీక్షలు చేయించుకోగా 13 మందికి పాజిటివ్‌గా తేలింది. అదేరోజు రాత్రి ఫలితాలు వస్తే 19వ తేదీ రాత్రి వరకు వారిని ఎవరూ పట్టించుకోలేదు. వీరికి సంబంధించిన నివేదిక కూడా ప్రాథమిక/నగర ఆరోగ్య కేంద్రాలకు చేరలేదు. విషయం మేయర్‌ రామ్మోహన్‌తోపాటు, ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు దృష్టికి రావడంతో స్పందించి చర్యలకు ఆదేశించారు.

సమస్య పరిష్కరిస్తాం

కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో రోగుల సంఖ్య పెరిగింది. ఫలితాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలో కొంత ఇబ్బంది ఉంది. దీనివల్లే వెంటనే రోగులను పరీక్షించడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. ఒకటి రెండురోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం. స్వల లక్షణాలు ఉన్నవారిని ఇంట్లోనే ఉంచి వైద్య సహాయం అందిస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- డాక్టర్‌ శ్రీనివాసరావు, ఆరోగ్యశాఖ సంచాలకులు

వైరస్‌ విస్తరించకుండా చర్యలు

మహానగరంలో కరోనా విస్తరించకుండా బల్దియా అన్ని చర్యలు తీసుకుంటోంది. పాజిటివ్‌ వచ్చినవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించడం గాని, ఇంట్లోని ఉంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోమని వైద్య విభాగాన్ని కోరాం. ఇందులో ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్ష చేసి చర్యలు తీసుకుంటాం.

- బొంతు రామ్మోహన్‌, మేయర్‌

ఇదీ చదవండి:కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ABOUT THE AUTHOR

...view details