తెలంగాణ

telangana

Central Govt video conference : 'ఎండలను తట్టుకునేందుకు తెలంగాణ ద్విముఖ వ్యూహం'

By

Published : Jun 21, 2023, 4:43 PM IST

Harishrao with central Govt video conference : దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తెలంగాణలో చేపట్టిన సంరక్షణ చర్యలను మంత్రి వివరించారు.

Harishrao
Harishrao

Heat stroke across India : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వడగాలులు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి పాల్గొన్నారు.

తెలంగాణలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముందస్తుగా అప్రమత్తమై ప్రజారోగ్య సంరక్షణ కోసం ద్విముఖ వ్యూహం అనుసరించిందని కేంద్రానికి మంత్రి హరీశ్​రావు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే అన్ని స్థాయిల్లోని ఆరోగ్య సిబ్బందికి వడదెబ్బకు గురైన బాధితులకు సత్వర చికిత్సపై శిక్షణ ఇచ్చామన్నారు. పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్, హాస్పిటల్ రెస్పాన్స్ వ్యవస్థలను సంసిద్ధం చేసి.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

పీహెచ్​సీ స్థాయి నుంచి అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం సహా.. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో నీడ, నీటి వసతి ఉండేలా చూశామని పేర్కొన్నారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డులు, ఐసీయూ బెడ్స్​తో పాటు.. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐవి ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ఇతర మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

డీహైడ్రేషన్‌తోనే ముప్పు : ఉష్ణోగ్రత అధికమయ్యే కొద్దీ శరీరం చెమట రూపంలో లవణాలను కోల్పోయి డీహైడ్రేషన్‌ ముప్పు ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, వాంతులు, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం, సొమ్మసిల్లి పోవడం, నీరసించడం లాంటివి వడదెబ్బ లక్షణాలు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అధిక వేడికి త్వరగా నీరసించిపోతారని పేర్కొంటున్నారు.

ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటిన సమయంలో శరీరం ఆ వేడికి ప్రభావితమైతే దేహం పనితీరు పెరుగుతుందని అంటున్నారు. అలాంటి సమయంలో అంతర్గత అవయవాలను, బయట చర్మాన్ని చల్లబర్చడానికి ఎక్కువ నీరు అవసరమవుతుందని పేర్కొంటున్నారు. అందుకే వేసవిలో ఎక్కువగా నీటిని తీసుకోకపోతే దేహం డీహైడ్రేషన్​కు గురవుతుందని హెచ్చరిస్తున్నారు.

చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి :చిన్నపిల్లలు ఉష్ణోగ్రతలకు త్వరగా ప్రభావితమవుతారు. ఎండల నేపథ్యంలో పిల్లలను ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరుబయటికి వెళ్లనీయకపోవడం మంచిది. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీలు దాటితే తడివస్త్రం కప్పి వైద్యులను సంప్రదించాలి. అలాగే వారు బయటినుంచి రాగానే చల్లని నీటిని తాగకుండా చూడాలి. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details