తెలంగాణ

telangana

కొవిడ్​ నిబంధనలు పాటించాలంటూ ప్రజల్లో అవగాహన

By

Published : Apr 27, 2021, 10:26 PM IST

రాష్ట్రంలో కరోనా కట్టడికి యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. మహమ్మారి నివారణకు నిబంధనలు పాటించాలంటూ... ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్‌ విజృంభిస్తున్నా పలుచోట్ల జాతరలు, పండుగలు చేసుకుంటూ కొందరు వైరస్‌ సమూహ వ్యాప్తికి కారణమవుతున్నారు.

covid rules Awareness programme, covid rules should be followed in telangana
కొవిడ్​ నిబంధనలు పాటించాలంటూ ప్రజల్లో అవగాహన

కొవిడ్​ నిబంధనలు పాటించాలంటూ ప్రజల్లో అవగాహన

కరోనా రెండోదశ రాష్ట్రంపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. మహమ్మారిని తుదముట్టించేందుకు రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా అమలుచేస్తున్నా... వైరస్‌ వ్యాప్తి ఏ మాత్రం ఆగడం లేదు. నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామ మాజీ వార్డు సభ్యురాలు కొవిడ్‌ సోకగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె భౌతికదేహాన్ని జేసీబీలో తరలించి... పంచాయతీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు నిర్వహించారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారంలో కరోనాకు... ఓ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు బలయ్యారు. అంత్యక్రియల నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల...జేసీబీ సాయంతో పంచాయతీ సిబ్బంది ఆఖరి తంతు పూర్తి చేశారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరలో రెండురోజుల క్రితం ఓ వృద్ధురాలికి కోవిడ్‌ సోకగా ఏమవుతుందోననే భయంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

పీజీ వైద్య పరీక్షలు వాయిదా?

కరోనా కట్టడి కోసం ప్రజలంతా సహకరిస్తేనే సాధ్యమవుతుందని మహబూబ్‌నగర్‌ ఎస్​పీ వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు బజార్ కూడలిలో కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఆయన... అపోహలు మాని ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా మే 5 నుంచి జరగాల్సిన పీజీ వైద్య పరీక్షలను వాయిదా వేయాలని జూనియర్‌ వైద్యులు... కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతికి విన్నవించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా పరీక్షల పేరిట దోపిడీ జరుగుతోంది. ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్​లో కంటే మెరుగైన ఫలితం వస్తోందంటూ సీటీ స్కానింగ్‌లు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే అదనుగా ఒక్కో సీటీ స్కానింగ్‌కు 5 వేల బిల్లువేస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వందల సంఖ్యలో జనం

మహమ్మారి ఇంతలా విరుచుకుపడుతున్నా... కొన్ని ప్రాంతాల్లో సామూహిక పండగలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కంచుపాడులో నిబంధనలు పాటించకుండా ప్రజలు ఎల్లమ్మ జాతర వేడుకగా నిర్వహించారు. భౌతిక దూరం పాటించకుండా... మాస్కు ధరించకుండానే పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొంటూ మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా హోన్నాజీ పేటలో బీరప్ప పండగను పెద్దఎత్తున ఓ సామాజిక వర్గ ప్రజలు గుమిగూడి చేసుకున్నారు. వందల సంఖ్యలో జనం ఒక్కటే చోట చేరి ఉత్సవం జరుపుకుంటుండటం వల్ల కేసులు పెరుగుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇదీ చూడండి: ఏపీలో కొత్తగా 11 వేల 434 కరోనా కేసులు, 64 మరణాలు

ABOUT THE AUTHOR

...view details