తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2020, 7:55 AM IST

ETV Bharat / state

సీతమ్మ సాగర్​ నిర్మాణానికి భూసేకరణ

ఉన్నతాధికారుల చొరవతో సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు పనులపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారుల్లో కదలిక ఏర్పడింది. ఇటీవల సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించిన రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, సీఎంఓ అధికారి స్మితాసబర్వాల్‌, ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌లు.. సీతమ్మ సాగర్‌ నిర్మాణంపై సమీక్ష జరిపారు. పక్షం రోజుల్లో ప్రాజెక్టు భూ సేకరణ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు వేగంగా భూసర్వే చేస్తున్నారు.

Land acquisition for construction of Seethamma Sagar in bhadradri kothagudem district
సీతమ్మ సాగర్​ నిర్మాణానికి భూసేకరణ

తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మ సాగర్‌ పేరుతో మరో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ప్రస్తుతం ఉన్న దుమ్మగూడెం ఆనకట్ట (సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆనకట్ట)కు 200 మీటర్ల దూరంలో దీన్ని నిర్మించనున్నారు. డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్టు) పూర్తి కావటం వల్ల ఇంజినీరింగ్‌ అధికారులు ప్రస్తుతం భూసేకరణ సర్వే చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పనులను పక్షం రోజుల్లో పూర్తి చేసి, భూసేకరణ ప్రారంభించేలా అధికారులు సమాయత్తమవుతున్నారు. అక్టోబరులో నిర్మాణ పనులు ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

రెండు విడతలుగా..

సీతమ్మ సాగర్‌ నిర్మాణానికి అవసరమైన భూములను రెండు విడతలుగా సేకరించనున్నారు. మొదటి విడతలో కుడి వైపున అశ్వాపురం మండలంలో 138.29, మణుగూరు మండలంలో 119.13, ఎడమ వైపున దుమ్ముగూడెం మండలంలో 213.27 ఎకరాలు వెరసి 470.69 ఎకరాలు సేకరించనున్నారు. రెండో విడత కుడి వైపున అశ్వాపురం మండలంలో 154.22 ఎకరాలు, మణుగూరు మండలంలో 236.18 ఎకరాలు, ఎడమ వైపున దుమ్ముగూడెం మండలంలో 205.36, చర్ల మండలంలో 739.17 ఎకరాలు వెరసి 1334.93 ఎకరాలు సేకరించనున్నారు. ఆనకట్ట, కరకట్టల నిర్మాణాల కోసం మొత్తం 1,808.17 ఎకరాల భూమి అవసరం కానున్నది. భూ సేకరణ, పెగ్‌ మార్కింగు తదితర కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు 70 టీఎంసీల గోదావరి జలాలను ఇక్కడి నుంచే సమీకరించనున్నారు. ఆనకట్ట నిర్మాణంతో గోదావరి మిషన్‌ భగీరథ వంటి ప్రసిద్ధ తాగునీటి పథకాలు, భారజల ప్లాంటు, రాష్ట్ర ప్రభుత్వ సింగరేణి, భద్రాది థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టు వంటి పరిశ్రమలకు సరిపడా జలాలు లభ్యం కానున్నాయి.

ఎగువ ప్రాంతాలకు నీరు మళ్లించేలా..

సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయటం ద్వారా వచ్చే బ్యాక్‌ వాటర్‌ని పినపాక నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు మళ్లించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లిలోని ఎగువ ప్రాంతాల్లో పంటల సాగుకు గోదావరి జలాలు మళ్లించేలా ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు ద్వారా నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు అందాయి. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌ డెవలప్‌మెట్‌ కార్పొరేషన్‌(ఐడీసీ) అధికారులు నీటి మళ్లింపుపై డీపీఆర్‌ తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంకోపక్క ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను పులుసుబొంత, కిన్నెరసాని ప్రాజెక్టులకు మళ్లించనున్నారు. నీటి మళ్లింపుతో ఈ నాలుగు మండలాల్లో 60 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.

సర్వే పనులు కొనసాగుతున్నాయి

ప్రస్తుతం భూసేకరణ సర్వే పనులు కొనసాగుతున్నాయి. రెవెన్యూ అధికారుల సాయం తీసుకుంటున్నాం. పెగ్‌ మార్కింగులు జరుపుతున్నాం. నిర్మాణ పనులను సొంతం చేసుకున్న కంపెనీ ప్రతినిధులూ ఈ ప్రక్రియలో పాల్పంచుకుంటున్నారు.

- రాంబాబు, సీతమ్మ సాగర్‌ డీఈ

ABOUT THE AUTHOR

...view details