తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబ్ కొంపముంచిన అంపైర్ నిర్ణయం

ఐపీఎల్ రెండో మ్యాచ్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్​ సూపర్ ఓవర్​కు దారితీయగా ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో అంపైర్ నిర్ణయం వల్లే పంజాబ్ ఓటమి పాలైందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

By

Published : Sep 21, 2020, 9:08 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

Umpiring howler affected outcome of KXIP match against Delhi Capitals
పంజాబ్ కొంపముంచిన అంపైర్ నిర్ణయం

ఒక్క పరుగు.. మ్యాచ్ గమనాన్నే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐపీఎల్​లోనూ అలాంటి సంఘటనలు చూశాం. జట్టు నిర్లక్ష్యం వల్ల అలా ఓడిపోతే తప్పు తమదేనని చింతించవచ్చు. కానీ వారు ఏ తప్పు చేయకుండా ఓడిపోతే.. ఓ అంపైర్ నిర్ణయం జట్టు కొంపముంచితే!.. నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్- దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో ఇదే జరిగింది. అంపైర్ నిర్ణయం పంజాబ్ ఓటమికి కారణమైంది.

గతేడాది ఐపీఎల్​లో నోబాల్స్ తప్పిదాలు చాలా జరిగాయి. దీంతో ఈసారి కొత్తగా టీవీ అంపైర్లకు నోబాల్ నిర్ణయించే బాధ్యతను అప్పగించారు. కానీ నిన్నటి మ్యాచ్​లో అంపైర్ నితిన్ మేనన్ ప్రకటించిన షార్ట్ రన్ నిర్ణయం వివాదాస్పదమైంది. దిల్లీ చేతిలో పంజాబ్​ ఓటమికి కారణమైంది. దీంతో మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​తో పాటు పలువురు అంపైర్​ని తప్పుబడుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

ఏం జరిగిందంటే ?

మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటిల్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. చివర్లో విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రబాడకు బౌలింగ్ అప్పగించాడు. ఈ ఓవర్‌లో జాగ్రత్తగా ఆడిన మయాంక్ అగర్వాల్ (89) రెండు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని ఫుల్‌టాస్​గా వేయగా.. ఎక్స్‌ట్రా కవర్ దిశగా మయాంక్ ఆడాడు. ఈ సమయంలో రెండు పరుగుల కోసం ప్రయత్నించగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న క్రిస్‌ జోర్దాన్ సింగిల్‌ని పూర్తి చేసే క్రమంలో కీపర్ ఎండ్‌వైపు సరిగా క్రీజులో బ్యాట్ పెట్టలేదని తేల్చిన స్వ్కేర్‌ లెగ్‌ అంపైర్ నితిన్ మేనన్.. 'షార్ట్ రన్‌'గా ప్రకటించి పంజాబ్​కు ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు.

చివరి ఓవర్‌లో మయాంక్ ఔట్ కావడం వల్ల పంజాబ్ 157/8తో నిలిచింది. ఫలితంగా ఇరుజట్ల స్కోర్లు సమమై మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ సూపర్ ఓవర్‌లో దిల్లీ గెలుపొందింది.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details