Dhoni First IPL Auction: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అతడికి ప్రత్యేకమైన అభిమాన గణం కూడా ఉంది. ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ(ఐదు సార్లు) తర్వాత అత్యధికంగా నాలుగు సార్లు ట్రోఫీ సాధించిన నాయకుడిగా మహీ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. 2016-17 సీజన్లలో చెన్నై నిషేధానికి గురైనా తర్వాత జరిగిన నాలుగు సీజన్లలో రెండు సార్లు జట్టును విజేతగా నిలిపాడు. అలాంటి గొప్ప సారథి 2008లో తొలిసారి జరిగిన ఐపీఎల్ వేలంలో ఎలా రంగ ప్రవేశం చేశాడో మాజీ ఆక్షనీర్ రిచర్డ్ మాడ్లీ (వేలం పాట నిర్వహించే వ్యక్తి) తాజాగా గుర్తు చేసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ నాటి విశేషాల్ని పంచుకున్నాడు.
Dhoni First IPL Auction Price: ఐపీఎల్ తొలి వేలంలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్వార్న్ పేరును పరిచయం చేయగానే రాజస్థాన్ రాయల్స్ టీమ్ సొంతం చేసుకుందని చెప్పాడు. అప్పుడు అతడి కనీస ధర 4,50,000 డాలర్లకే రాజస్థాన్ సొంతమయ్యాడని మాడ్లీ తెలిపాడు. ఇక ధోనీ వేలంలోకి అడుగుపెట్టాక ఫ్రాంఛైజీల మధ్య పోటీ నెలకొందని పేర్కొన్నాడు. '2008లో తొలిసారి నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్.. షేన్వార్న్ను ఎలాంటి పోటీ లేకుండానే కొనుగోలు చేసింది. ఇక మహీ వేలంలో అడుగుపెట్టగానే ఫ్రాంఛైజీల మధ్య పోటీ నెలకొంది. అతడిని కొనుగోలు చేసేందుకు అందులో పాల్గొన్న జట్లు ఆసక్తి చూపాయి' అని మాడ్లీ తన తొలి వేలం పాట రోజును నెమరువేసుకున్నాడు.