తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మంచి పిచ్ ఉంటే.. టెస్ట్ క్రికెట్ మజానే వేరు'

సరైన పిచ్​లు తయారుచేస్తే టెస్టు మ్యాచ్​లు వినోదాన్ని కలిగిస్తాయని మాస్టర్ బ్లాస్టర్ సచిన్​ తెందూల్కర్ అభిప్రాయపడ్డాడు. ముంబయిలో ఓ మారథాన్​ పాల్గొన్న ఈ దిగ్గజ ఆటగాడు... టెస్టు క్రికెట్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By

Published : Aug 25, 2019, 5:40 PM IST

Updated : Sep 28, 2019, 5:40 AM IST

సచిన్

ఐపీఎల్, ప్రపంచకప్​ టోర్నీలతో దాదాపు మూడు నెలల పాటు క్రికెట్​ ప్రియులు పండగ చేసుకున్నారు. మెగాటోర్నీ ముగిసినా అదే ఆసక్తిని కొనసాగించేందుకు ఐసీసీ వినూత్నంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ను తీసుకొచ్చింది. సుదీర్ఘ మ్యాచ్​ల్లో ఈ సరికొత్త నిర్ణయం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందన్న ప్రశ్నకు మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్​ స్పందించాడు. టెస్టు క్రికెట్​ కూడా అభిమానులకు మజాను ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే అందుకు మంచి పిచ్​లు మరిన్ని తయారుచేయాలని సూచించాడు.

"టెస్టు​లకు అనుకూలించే పిచ్​ల్లో మ్యాచ్​లు ఆడితే ఆట ఆసక్తికరంగా ఉంటుంది. పిచ్​లు బాగుంటేనే క్రికెట్ బోర్ కొట్టదు. ఉత్కంఠ గొలిపే మలుపులు, మంచి బౌలింగ్ స్పెల్స్​, అద్భుతమైన బ్యాటింగ్​తో వీక్షకులను ఆకట్టుకోవచ్చు. ప్రజలు అప్పుడే ఎక్కువగా టెస్టుపై దృష్టిపెడతారు"
-సచిన్ తెందూల్కర్​

యాషెస్ సిరీస్ ఉత్కంఠగా సాగుతూ ఆకట్టుకుంటోందని... గత వారం లార్డ్స్​లో జరిగిన రెండో టెస్టులో స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్ మధ్య మంచి పోటీ నెలకొందని తెలిపాడు మాస్టర్.

"దురదృష్టవశాత్తు రెండో టెస్టులో స్మిత్​కు గాయమై మ్యాచ్​కు దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లతో అతడికి సవాల్ విసిరి.. మ్యాచ్​ను థ్రిల్లింగ్​గా మార్చాడు. స్మిత్ ఔటవ్వకుండా ఉంటే ప్రేక్షకులు మరింత ఆసక్తిగా మ్యాచ్​ తిలకించేవాళ్లు"
-సచిన్ తెందూల్కర్​

ప్రపంచకప్ గురించి ఫైనల్​ జరిగిన నాలుగు, ఐదు వారాల తర్వాత అందరూ మర్చిపోయారని లిటిల్​ మాస్టర్​ అభిప్రాయపడ్డాడు.

"ఇంగ్లాండ్​లో ప్రపంచకప్​ ముగిసి నాలుగు వారాలే అయింది. అయితే మెగాటోర్నీ గురించి ప్రస్తుతం ఎవరూ మాట్లాడుకోవట్లేదు. ప్రపంచ టెస్ట్​ చాంపియన్​షిప్​పైనే అందరి చూపు ఉంది".
-సచిన్ తెందూల్కర్

ముంబయిలో ఐడీబీఐ నిర్వహించిన హాఫ్ మారథాన్​లో పాల్గొన్న మాస్టర్ బ్లాస్టర్.... టెస్టు క్రికెట్​కు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. 200 టెస్టుల్లో సచిన్ 15వేల 921 పరుగులు చేశాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య యాషెస్​ జరుగుతోంది. ఈ సిరీస్​తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ప్రారంభమైంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్రస్తుతం ఈ ఛాంపియన్​షిప్​లో భాగంగానే రెండు టెస్టు మ్యాచ్​లు ఆడుతోంది.

ఇదీ చదవండి: ప్రపంచ ఛాంపియన్​ అయ్యేదెవరు..?

Last Updated : Sep 28, 2019, 5:40 AM IST

ABOUT THE AUTHOR

...view details